ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దని కేంద్రాన్ని కోరాం..

*ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దని కేంద్రాన్ని కోరాం..*

దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని ఫిర్యాదు చేశారు. భేటీ ముగిసిన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.. బనకచర్ల లింక్ ప్రాజెక్టు చట్ట విరుద్ధమని చెప్పామని.. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.

ఇప్పటివరకు డీపీఆర్ ఇవ్వలేదు..

బనకచర్లపై త్వరలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తామని కేంద్రమంత్రి చెప్పారని, గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు తెలంగాణకు బ్లాంకెట్ noc ఏపీ రాసివ్వాలని కోరామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దానికి కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలపాలన్నారు. అప్పుడే తాము బనకచర్లపై ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు తప్పనిసరి అని, ఇప్పటి వరకు ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదని అన్నారు.

వీలైతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం..

బనకచర్ల ప్రాజెక్టు అంశంలో తమకు ఉన్న అభ్యంతరాలను కేంద్రమంత్రికి వివరించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు పట్ల తెలంగాణ ప్రజల్లో తెలంగాణ రైతుల పట్ల ఆందోళన ఉందని, గోదావరి కృష్ణ నుంచి 1500 టీఎంసీల వాటర్ తెలంగాణకు బ్లాంకెట్ noc ఇస్తే దాని ద్వారా కోటిన్నర ఎకరాలకు నీళ్లు అందించగలుగుతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు త్వరితగతిన ఆమోదాలు లభిస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు వేగవంతంగా నిర్మాణం చేయాలనుకున్నా.. ప్రాజెక్టులు అనుమతులు నెమ్మదిగా అవుతున్నాయని మంత్రి అన్నారు. అయితే తమ అభ్యంతరాలపై కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అన్ని విధాలుగా హామీ ఇచ్చారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మూసి పునర్జీవం కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారన్నారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా అన్ని విధాల చర్యలు చేపడతామని చెప్పారన్నారు. బనకచర్ల ప్రాజెక్టు అంశంలో వీలైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు..

Join WhatsApp

Join Now

Leave a Comment