Site icon PRASHNA AYUDHAM

ఉమ్మడి మెదక్ జిల్లాలో కార్పొరేట్ స్కూళ్ల దోపిడీ

07052022002848n83

*పుస్తకాలూ, యూనిఫాంలూ మార్కెట్ కంటే మించిన ధరలతో పాఠశాలలోనే అమ్మకాలు*

*లక్షల్లో ఫీజులు.. అధికారులు మౌనం..*

*పిల్లల చదువు కోసం పోరాడే తల్లిదండ్రులకు కార్పొరేట్ స్కూళ్ల లూటీ*

*అమలు కానీ విద్యా హక్కు చట్టం.*

సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): విద్యను హక్కుగా కాదు.. వ్యాపారంగా చూస్తున్న కార్పొరేట్ పాఠశాలల వ్యవహారంపై ఉమ్మడి మెదక్ జిల్లా వాసుల గుండె తడుతుంది. పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు జీవితాన్ని త్యాగం చేస్తుండగా, ప్రైవేటు స్కూళ్లు మాత్రం చదువుపై వ్యాపారం నడుపుతూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి.

*యూనిఫాంలు, పుస్తకాలు పాఠశాలలోనే… కానీ మార్కెట్ ధరలకంటే రెట్టింపు ధరలతో!*

తల్లిదండ్రులు స్వేచ్ఛగా మార్కెట్‌ నుంచి పుస్తకాలు లేదా యూనిఫాంలు కొనాలని అనుకున్నా, పాఠశాల యాజమాన్యం నుంచి తప్పించుకునే వీలే లేదు. పాఠశాలలోనే ఖరీదైన ధరలతో పుస్తకాలు, యూనిఫాంలు తప్పనిసరిగా కొనాల్సిందేనని వారిపై ఒత్తిడి తెస్తున్నారు. మార్కెట్‌లో రూ. 2,000 లో దొరికే బుక్‌సెట్‌కు రూ. 5,000 వసూలు చేస్తుండటం, సాధారణమైన రెండు జతల యూనిఫాంలకు రూ. 3,000-4,000 వరకూ చార్జ్ చేయడం మామూలయ్యింది.

*లక్షల్లో ఫీజులు.. ఓ మధ్యతరగతి కుటుంబానికి భారీ భారం*

తల్లిదండ్రులు అప్పులు చేసుకుంటున్నా.. తమ పిల్లలకు మంచి విద్య ఇవ్వాలని స్కూల్స్ ఎంచుకుంటున్నారు. కానీ విద్యార్థి ఒక్కరికి సంవత్సరానికి రూ. 40,000 నుంచి రూ. 1,00,000 రూపాయల వరకూ వసూలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని పాఠశాలలు అడ్మిషన్ ఫీజు, కంపల్సరీ డొనేషన్ పేరుతో వసూలు చేస్తున్నట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

*విద్యాశాఖ అధికారుల మౌనం.*

 కార్పొరేట్ స్కూళ్ల వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు మాత్రం చేతులు ఊపేసినట్టున్నారు. ఏ పాఠశాలపై విచారణ జరిగింది..? ఎవరిని ప్రశ్నించారు..? అనుమతి లేకుండా యూనిఫాంలు అమ్మిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు..? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల స్కూళ్ల యాజమాన్యాలు మరింతగా రెచ్చిపోతున్నాయి.

*విద్యా హక్కు చట్టం పాటించాలి.*

విద్యను అందరికీ సమానంగా అందించాలనే ఉద్దేశంతో రూపొందించిన విద్యా హక్కు చట్టం (ఆర్ టీఈ) కొన్ని కార్పొరేట్ పాఠశాలల్లో యథాతథంగా అమలవుతుండగా, ప్రైవేటు స్కూళ్లకు మాత్రం వర్తించట్లేదు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం జీవితం త్యాగం చేస్తే… ప్రభుత్వ విధానాలు, అధికారులు వారిని ఆదుకోవాల్సింది పోయి స్కూళ్ల వశం కావడం బాధాకరం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యను వ్యాపారంగా మలిచే కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Exit mobile version