*అతి త్వరలో నెరవేరనున్న గన్నేరువరం ప్రజల చిరకాల వాంఛ*
*కేంద్ర నిధులతో హైలెవెల్ బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్రం సుముఖత*
*రూ.77 కోట్ల వ్యయంతో 18 కి.మీల పొడువునా హైలెవెల్ బ్రిడ్జి, రోడ్డు నిర్మాణ ప్రతిపాదనలు సిద్దం*
*మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లికి తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్*
*కవ్వంపల్లి విజ్ఝప్తి మేరకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు కేంద్ర మంత్రి రాక*
*గన్నేరువరం బ్రిడ్జిపైనే చర్చ*
మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ విజ్ఝప్తి మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం తిమ్మాపూర్ ఎల్ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేశారు. తిమ్మాపూర్ మండలంలోని రామక్రిష్ణానగర్ కాలనీలో జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన రోడ్డును ప్రారంభించేందుకు వెళుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు కవ్వంపల్లి స్వాగతం పలికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి తోలోకొని వెళ్లారు. ఈ సందర్భంగా గన్నేరువరం మండలం గుండ్లపల్లి పోతారం నుండి బావూపేట, ఖాజీపేట వరకు హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం ప్రతిపాదనలపై చర్చించారు. మానేరు నదిపై హైలెవెల్ బ్రిడ్డి నిర్మించాలని స్థానిక ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే ప్రస్తావించగా, తప్పకుండా మండల ప్రజల కల నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం సహకరిస్తే ఎప్పుడో గన్నేరువరం బ్రిడ్జి పూర్తయ్యేదని, రాజకీయ కక్షతో వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందికి గురిచేసిందని బండి సంజయ్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి హైలెవెల్ బ్రిడ్జి ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లాయన్నారు. మొత్తం రూ.77 కోట్లతో 18 కిలోమీటర్ల పొడవునా నిర్మించేందుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. ఈ మేరకు కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి(సీఆర్ఎఫ్ఐ) కింద ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయబోతున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే కేంద్రం ఆమోదం తెలపనుందని, గన్నేరువరం ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోందని తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లితో కలిసి తిమ్మాపూర్ రామక్రిష్ణానగర్ కాలనీకి విచ్చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కవ్వంపల్లితో కలిసి సంయుక్తంగా ప్రారంభించారు.
అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ తిమ్మాపూర్ మండలంలో మొత్తం 1 కోటి 10 లక్షల రూపాయల జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో పలు గ్రామాల్లో రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. ఒక్కో రోడ్డుకు సగటున 10 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటికే దాదాపు 31 కోట్ల 12 లక్షల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయని వివరించారు. అందులో భాగంగా తిమ్మాపూర్ మండలంలో ఈ ఏడాది 1 కోటి 10 లక్షల రూపాయలను ఖర్చు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
‘‘రోడ్లు, జాతీయ రహదారుల విస్తరణకు మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. మన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే CRIF కింద 291 కోట్లను ఖర్చు చేసి 1341 కిలోమీటర్ల మేరకు రోడ్లను నిర్మించగలిగినం. తెలంగాణలోనే అత్యధికంగా CRIF నిధులను తీసుకొచ్చిన ఘనత మన కరీంనగర్ పార్లమెంట్ దే. జాతీయ రహదారుల నిర్మాణం కోసం దాదాపు 5 వేల కోట్లు ఖర్చు చేసినం… కరీంనగర్ నుండి వరంగల్, సిద్దిపేట నుండి ఎల్కతుర్తి నేషనల్ హైవేల నిర్మాణ పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. వాటి రూపురేఖలే మారిపోయినయ్. అతి త్వరలోనే కరీంనగర్- జగిత్యాల రోడ్డ నిర్మాణ పనులను కూడా ప్రారంభించబోతున్నం.’’అని పేర్కొన్నారు.