*భూ భారతి అమలులో సర్వేయర్ల పాత్ర కీలకం: అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూన్ 18
భూ భారతి చట్టం అమలులో లైసెన్స్ సర్వేయర్ల పాత్ర అత్యంత కీలకమని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అన్నారు. భూ భారతికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలోని షామీర్పేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన లైసెన్స్ సర్వేయర్ల శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, లైసెన్స్ సర్వేయర్లకు భూమి హద్దులు, రెవెన్యూ చట్టాలు, హక్కులు వంటి అంశాలపై అనుభవజ్ఞులైన నిపుణులతో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. సర్వేయర్లు భూ భారతి చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు.
ఈ శిక్షణ తరగతులు 45 రోజుల పాటు జరుగుతాయని, సర్వేయర్లు ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా విని, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శిక్షణ ద్వారా తమ నైపుణ్యాన్ని పెంపొందించుకొని, భూ భారతి చట్టం అమలులో తమ సేవలను అందించాలని సూచించారు. ప్రజలు, రైతుల సమస్యలను తొలగించడంలో అంకితభావంతో పనిచేసి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని అదనపు కలెక్టర్ సర్వేయర్లకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ యాదగిరి రెడ్డి, డీఐఓ బలరాం, లైసెన్స్ సర్వేయర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.