బాధితులకే బాబయ్యతో బాధలు..!!
ఇదెక్కడి విచిత్రం..?
ఇబ్బంది పెడుతున్న ఏఈకి అండగాఉన్నఅధికారులెవరు..?
బదిలీ చేయకుండా విచారణ జరిపిన విజిలెన్స్..?
సాక్షులను బెదిరిస్తున్న ఏఈ బాబయ్య..?
విచారణ అధికారులపై నమ్మకమే పోతోందా..?
గజ్వేల్, ఆగస్ట్ 7
అవినీతిపై విచారణ జరుగుతుందంటే… సంబంధిత అధికారి విధులనుండి తప్పించడమే నిబంధన. కానీ గజ్వేల్ టెక్నికల్ ఏఈ బాబయ్య విషయంలో ఆ నియమాలు పక్కకు పడేశారో ఏమో అనిపిస్తోంది. కాంట్రాక్టర్లపై బెదిరింపులు, అక్రమ సంపాదన, పదవిని అడ్డుపెట్టుకొని , సాక్షులను ప్రభావితం చేయడం వంటి ఆరోపణల మధ్యే బాబయ్య విధులు కొనసాగిస్తుండడం ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
విజిలెన్స్ అధికారులు ఆయనపై విచారణ మొదలుపెట్టినా, అదే పోస్టులో కొనసాగుతుండడం వల్ల బాబయ్య కాంట్రాక్టర్లను బాహాటంగానే బెదిరిస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “నన్నేం చేయలేరు.. నాకున్న సంబంధాలు చూస్తే చాలు” అంటూ విచారణను దారితప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడట..?
అధికారుల మౌనమే ముద్ర..?
బాబయ్యపై ఇప్పటికే 20 మందికి పైగా బాధితుల స్టేట్మెంట్లు నమోదు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ అధికారుల నుంచి చర్యలపై మౌనం కొనసాగుతుండటం అనుమానాలకు తావిస్తోంది. పైగా సాక్షులను బెదిరించాడన్న ఆరోపణలు విచారణ నైతికతను ప్రశ్నిస్తున్నాయి. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాల్సిన స్థానిక అధికారి, డివిజన్ ఇంజినీర్లు అండగా నిలవడం గమనార్హం.!
అవినీతి ఆరోపణలూ.. ఆస్తుల లెక్కలూ..?
బాబయ్య ఆదాయానికి మించిన ఆస్తులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండపాకలో పనిచేస్తున్న సమయంలో చేగుంట పరిసరాల్లో మూడు ఎకరాల భూమి కొన్నాడట. అంతేకాదు, ఇంకా అనేక చోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం. ఈ విషయాల్లో కూడా విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది..?
విచారణను దారితప్పించేందుకు ప్రయత్నాలు?
విజిలెన్స్ అధికారులపై ప్రభావం చూపేందుకు బాబయ్య పలు మార్గాలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. “నా మీద చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్ పరువు పోతుంది” అంటూ పలువురు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడట. ఇదంతా బాధితులకు తిరుగులేని దెబ్బగా మారుతోంది.
బాధితుల ఆకాంక్ష – నిష్పక్షపాత విచారణ కావాలి..!!
ఈ వ్యవహారంపై విజిలెన్స్ విభాగం, సీఎండీ నిష్పాక్షికంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్న డిమాండు బాధితుల్లో ఊపందుకుంది. “ఇలా వదిలేస్తే ఇంకా బాబయ్యలే పుడతారు” అని వ్యాఖ్యానిస్తున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే – బాధితులకే ముప్పుగా మారిన బాబయ్య వ్యవహారంపై దృష్టి పెట్టకపోతే, ఇది వ్యవస్థ పట్లనే నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని మేధావి వర్గం పేర్కొంటున్నారు