ఇందిరమ్మ ఇళ్ల పథకం పనులు వేగవంతం చేయాలి
అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా నవంబర్ 19:
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో మద్నూర్, ఎల్లారెడ్డి, భిక్నూర్ మండలాల ఎంపీడీఓలు, సంబంధిత శాఖా అధికారులతో దీనిపై సమీక్ష నిర్వహించారు.
మండలాల వారీగా పురోగతిని ఆరా తీయగా—
మద్నూర్ మండలం: 626 మంజూరులో 426 ఇళ్లు నిర్మాణ దశలో
ఎల్లారెడ్డి మండలం: 337లో 325 అప్రూవల్, 225 ఇళ్లు వివిధ దశల్లో
భిక్నూర్ మండలం: 669లో 656 అప్రూవల్, 495 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నట్లు**అధికారులు వివరించారు.
పెండింగ్లో ఉన్న గృహాల పనులను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి సంబంధిత ప్రతిపాదనలు వెంటనే పంపాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల గృహావసర సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, దరఖాస్తుల దశలో గ్రామ, వార్డు స్థాయిలో అధికారులు ప్రజలకు సహకరించాలని ఆయన సూచించారు. పథకం అమలు వేగవంతం చేయడానికి శాఖలంతా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
అర్హత సాధించిన కుటుంబాలు ప్రభుత్వం అందిస్తున్న సహాయం, సబ్సిడీలు, సౌకర్యాలను పూర్తిగా వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ మదన్ మోహన్, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ రవితేజ, సీఈఓ చందర్, డి ఎల్ పి ఓ ఇతర అధికారులు పాల్గొన్నారు.