దారుణంగా పాకిస్తాన్ పరిస్థితి, కేజీ ఉల్లి రూ.300

*దారుణంగా పాకిస్తాన్ పరిస్థితి, కేజీ ఉల్లి రూ.300*

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఇరు దేశాలు కూడా దాడులకు ప్రతి దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత ఆర్థిక పరిస్థితి బలంగా ఉండగా, పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మాత్రం దారుణంగా పడిపోయింది. ఎంతలా అంటే ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఇంధన కొరత భారీగా పెరిగింది. దీంతో ఇస్లామాబాద్‌లో 48 గంటల పాటు పెట్రోల్ బంకులకు బంద్ ప్రకటించారు. పెట్రోల్ ధరలు లీటర్‌కు 279.80 రూపాయలు ఉండగా, డీజిల్ 262 రూపాయలకు చేరుకుంది, అయినప్పటికీ కూడా లభించడం లేదు.

మరోవైపు రోజువారీ అవసరమైన వస్తువుల ధరలు కూడా పైపైకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లిపాయలు కిలోకు 330 రూపాయలకు చేరుకోగా, నిమ్మకాయలు 900 రూపాయలకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే కిలో చికెన్ ధర రూ.600కు చేరింది. డజన్ కోడి గుడ్ల రేటు మన దగ్గర రూ.70 ఉండగా, అక్కడ మాత్రం రూ.300కు చేరుకుంది. దీంతోపాటు పప్పులు, ఇతర ఉత్పత్తుల ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. ఈ ధరల పెరుగుదల అక్కడి ప్రజల జీవన వ్యయాన్ని భారీగా పెంచేసింది.

సింధు జలాల ఒప్పందం బ్రేక్ తర్వాత పాకిస్తాన్ వ్యవసాయం, జలవిద్యుత్ ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఈ క్రమంలో వ్యవసాయ ఉత్పత్తి తగ్గి, ఆహార కొరత, ధరల పెరుగుదల తప్పనిసరిగా మారింది. ఈ చర్య వల్ల పాకిస్తాన్‌లో నీటి కొరత, వ్యవసాయ సమస్యలు పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థ బలహీనత మరింత తీవ్రమైంది. ఇరు దేశాల మధ్య ఉన్న అట్టారీ – వాఘా సరిహద్దు ద్వారా 2023-24లో $470 మిలియన్ల వస్తువుల వాణిజ్యాన్ని నిర్వహించారు. కానీ ఇప్పుడు దీనిని భారత్ ఆపేసింది. ఈ నిషేధం వల్ల ఔషధాలు, పండ్లు, కూరగాయలు, ఇతర అవసరమైన వస్తువుల కొరత మరింత పెరిగింది. ఇది కూడా ధరలను మరింత పెంచేలా చేసింది.

ఆహార ధరల పెరుగుదల, ఔషధ కొరత వల్ల ఆసుపత్రులు శస్త్రచికిత్సలను వాయిదా వేస్తున్నాయి. ఈ ఆర్థిక కష్టాలు అనేక మంది పాకిస్తానీలు అక్రమ ప్రయాణాల ద్వారా దేశాన్ని విడిచిపెట్టేలా చేస్తున్నాయి. వస్తువుల కొరత, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ముప్పు ఈ అస్తవ్యస్థ దేశాన్ని మరింత గందరగోళంలోకి నెట్టుతున్నాయి. ఈ క్రమంలో భారత్‌తో సంబంధాలు ఇలాగే కొనసాగితే మాత్రం ఆర్థిక నష్టాలు మరింత పెరిగి దేశం నుంచి అనేక మంది వలస వెళ్లే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment