*రంగారెడ్డి జిల్లాలో దారుణం.. మరో పరువు హత్య….ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను హత్య చేసిన తమ్ముడు!*
అక్క మెడకు వైరు బిగించి హత్య
ఆపై అక్క స్పృహ కోల్పోయిందని బంధువులకు సమాచారం
పోలీసుల ప్రాథమిక విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితుడు
2023 నాటి షాద్నగర్ పరువు హత్యను గుర్తు తెచ్చిన ఘటన
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతోందని ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు రోహిత్ (20), తన అక్క రుచిత (21) మెడకు వైరు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన మేస్త్రీ దేశాల రాఘవేందర్, సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి పెద్ద కుమార్తె రుచిత డిగ్రీ పూర్తి చేసి, ఎంబీఏ అడ్మిషన్ కోసం ఎదురుచూస్తోంది. అదే గ్రామానికి చెందిన ఒక యువకుడితో ఆమెకు ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయంపై గతంలో కుటుంబంలో గొడవలు జరిగాయి, పంచాయితీ కూడా జరిగింది. అప్పుడు రుచిత, ఆ యువకుడు ఇకపై మాట్లాడుకోబోమని చెప్పడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగింది.