*కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్… ప్రారంభ తేదీ ఇదే*
హైదరాబాద్, ఏప్రిల్ 8: రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరతగతిన పూర్తి అయ్యేందుకు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర సర్కార్. రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్స్ విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక నుంచి స్లాట్ బుకింగ్స్తో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈనెల 10 నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి రానుందని తెలిపారు. ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నట్లు చెప్పారు.
చట్టసవరణతో డబుల్ రిజిస్ట్రేషన్కు చెక్ పెట్టనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లకు దాదాపు 45 నిమిషాలు పడుతోంది. ఇప్పుడు స్లాట్ బుకింగ్స్ విధానంతో కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.
కాగా.. ప్రజలకు పారదర్శక, అవినీతిరహితంగా మరింత మెరుగైన సేవలను సమర్థవంతంగా అందించేందుకుగాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానంలో రిజిస్ట్రేషన్లు జరిగేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి ఈ విషయాన్ని చెప్పారు. స్లాట్ బుకింగ్ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు గంటల తరబడి నిరీక్షించకుండా త్వరితగతినే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ను పూర్తి చేసుకోవచ్చాన్నారు. ఇందు కోసం సాంకేతి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునేలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఆధునీకీకరణకు సర్కార్ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), చాట్ బోట్స్ సేవలను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. స్లాట్ బుకింగ్ విధానం దృష్ట్యా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరణ చేయాలని సమీక్షలో అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచనలు చేశారు..