*ఈ సారి మే 27నే కేరళలోకి రుతుపవనాలు..*
భారతదేశంలో ఇంకొన్ని రోజుల్లో ఎండాకాలం ముగియనుంది. వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు వరుణుడు రాబోతున్నాడు. ఈ సారి అంచనాల కంటే ముందే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించనున్నాయి. చాలా ఏళ్ళ తర్వాత జూన్ కంటే ముందుగానే వర్షాకాలం రాబోతున్నట్లు భారత వాతావరణ శాఖ శనివారం ప్రకటించింది. మే 27 నుంచి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకి వర్షాలు మొదలుకాబోతున్నట్లు వెల్లడించింది. సాధారణంగా జూన్ నెల ప్రారంభమయ్యాకే వర్షాకాలం వస్తుంది. ఈ సంవత్సరం అందుకు భిన్నంగా కొన్ని రోజులు ముందే రాబోతోంది.
నో ఎల్ నినో ..
నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినప్పటి నుంచే వర్షాకాలం మొదలవుతుంది. జూన్ 1 నుంచి మొదలై జూన్ 8 కంతా దేశవ్యాప్తంగా విస్తరించి వర్షాలు కురుస్తాయి. ఇక గతంతో పోలిస్తే 2025లో భారీ వర్షాలు పడతాయని.. ఎల్ నినో పరిస్థితులు ఉండబోవని ఐఎండీ పేర్కొంది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణానికి మించి వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టం చేసింది.