**పొగాకు ఆరోగ్యానికి ముప్పు – ప్రజల్లో అవగాహన పెంచాలని డా. ఉమా గౌరి పిలుపు**
**ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా కూకట్పల్లిలో అవగాహన కార్యక్రమం**
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం మే 31
పొగాకు అనేది ప్రాణాంతక అలవాట్లలో ఒకటిగా మారిందని, ఇది ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. సి. ఉమా గౌరి పేర్కొన్నారు. శనివారం నాడు ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని కూకట్పల్లి యూపీహెచ్సీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) ప్రోగ్రాం అధికారి డా. బి. మల్లేశ్వరి అధ్యక్షత వహించగా, యూపీహెచ్సీ కూకట్పల్లి వైద్యాధికారిణి డా. మమత సమన్వయాన్ని చేపట్టారు. కార్యక్రమానికి భాగంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ముందుగా ర్యాలీ నిర్వహించగా, అనంతరం యూపీహెచ్సీ ప్రాంగణంలో అవగాహన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా డా. ఉమా గౌరి మాట్లాడుతూ, పొగాకు వినియోగం వలన దానిని ఉపయోగించే వ్యక్తికే కాదు, పక్కన ఉన్నవారికి కూడా ఆరోగ్య ప్రమాదాలు తలెత్తుతాయని తెలిపారు. యువత ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు మొగ్గు చూపాలని, పొగాకు వంటి హానికర అలవాట్ల నుండి దూరంగా ఉండాలని సూచించారు. “ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం మన అందరి బాధ్యత” అని ఆమె అన్నారు.
అధ్యక్షులుగా మాట్లాడిన డా. బి. మల్లేశ్వరి “శుభ్రంగా శ్వాస తీసుకోండి, పచ్చగా కాలకాలం జీవించండి – ఈ రోజే పొగాకు మానేయండి” అనే నినాదంతో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది కలిసి “పొగాకు రహిత సమాజం కోసం” ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో డా. మమతతో పాటు యూపీహెచ్సీ సిబ్బంది, పలువురు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.