తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో, బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో నిర్వహించనున్న సభ సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటల నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఈ ఆంక్షలు సభ పూర్తయ్యే వరకు కొనసాగుతాయి. ప్రజలు, వాహనదారులకు పోలీసుల సూచనలను పాటించాలని ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, ఇచ్చోడ నుండి పిప్పిరి గ్రామం వరకు "వన్ వే" విధానాన్ని అమలు చేయనున్నారు. నిర్మల్ వైపు నుండి వచ్చే వాహనాలు జాతీయ రహదారిపై బోథ్ ఎక్స్ రోడ్, పోచ్చరా ఎక్స్ రోడ్, సోనాల, బజార్హత్నూర్ మీదుగా పిప్పిరి సభాస్థలికి చేరుకోవాలని సూచించారు.
సభకు హాజరయ్యే ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఇచ్చోడ బస్టాండ్ మీదుగా దిగ్నూర్, గంగాపూర్, లక్ష్మీ నాయక్ తండ మార్గం ద్వారా కేటాయించిన పార్కింగ్ స్థలాలకు చేరుకోవాలి. వాహనాలను రోడ్లపై నిలపకుండా, నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలపాలని స్పష్టం చేశారు.
అడేగాం, పిప్పిరి, గిర్నూర్ గ్రామ ప్రజలు తమ పశువులను రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఉదయం 8 గంటలలోపు వ్యవసాయ పనులు, పశువుల తరలింపు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ ఆంక్షలు ప్రజల భద్రత, ట్రాఫిక్ సౌకర్యం కోసమేనని, అందరూ సహకరించాలని డిఎస్పీ కోరారు.











