ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (ఐ.ఎస్.ఆర్.డి) ఆధ్వర్యంలో మహిళ సమాఖ్య సమావేశం..
మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన..
ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (ఐ.ఎస్.ఆర్.డి) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాజంపేట మండలం మహిళ సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మానవ అక్రమ రవాణా, సామాజిక మాధ్యమాల వల్ల ఎదురవుతున్న సమస్యలు, మాదక ద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు (మోసాలు), బాల్య వివాహాలు వంటి అంశాలపై విశేష అవగాహన కల్పించారు.
మాదక ద్రవ్యాల వినియోగం – ఆందోళనకర పరిస్థితి..
ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు సొలంకి రవళి మాట్లాడుతూ, “ఒకప్పుడు పట్టణాలకు మాత్రమే పరిమితమైన మాదక ద్రవ్యాల వినియోగం ఇప్పుడు గ్రామాల్లోకి కూడా విస్తరించింది. యువత, విద్యార్థులు ఈ వ్యసనాలకు బానిసలై, వారి భవిష్యత్తును గందరగోళంలో పడేస్తున్నారు,” అని ఆందోళన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వల్ల కుటుంబాలకు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయనీ, ఈ ప్రమాదకర పరిస్థితి నుండి సమాజాన్ని రక్షించేందుకు తక్షణం చర్యలు అవసరమని ఆమె అన్నారు. ఆమె “భావి భారతం ఆరోగ్య భారతం”గా నిర్మించాలనే లక్ష్యాన్ని ప్రస్థావించారు.
సామాజిక మాధ్యమాల వినియోగం – అవసరమైన జాగ్రత్తలు..
సొలంకి రవళి మరింతగా చర్చిస్తూ, “నేటి సామాజిక మాధ్యమాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న వయస్సులోనే విద్యార్థులు ఆకర్షణ, ఆనందం, వ్యామోహం కారణంగా తమ జీవితాలను ఇతరులకు తాకట్టు పెడుతున్నారు,” అని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పర్యవేక్షిస్తూ, చదువుపై దృష్టి సారించేలాగ చూడాలని ఆమె సూచించారు.
సైబర్ నేరాలు – జాగ్రత్తలు పరిష్కార మార్గాలు..
సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ, “అనుమానాస్పద వ్యక్తుల నుండి వచ్చిన ఓటీపీలు, లింకులు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. అలా చేయడం వల్ల బ్యాంకు అకౌంట్ల నుండి నగదు తస్కరణకు అవకాశం ఉంటుంది,” అని రవళి హెచ్చరించారు. సైబర్ మోసాల గురించి తెలిసిన వెంటనే 1930 నెంబర్కు కాల్ చేసి లేదా www.ncrp.gov.in వెబ్సైట్లో పిర్యాదు చేయవచ్చని ఆమె వివరించారు. సమయానికి పిర్యాదు చేయడం వల్ల పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు..
ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మి, ఎపీఎం సాయిలు, సంస్థ ప్రతినిధులు కొప్పుల రవి, సంజీవ్, విఠల్ రావు, కేజీబీవీ ప్రత్యేక అధికారి శ్రీవాణి, వివిధ గ్రామాల అధ్యక్షులు, సి.సిలు తదితరులు పాల్గొన్నారు.