*వెలుగులోకి రెండు పురాతన* *బావులు….*
కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలo శేషాచల కొండల్లో రసూల్ పల్లి బీట్ అటవీ ప్రాంతంలో సదాశివరాయల కాలం నాటి రెండు పురాతన బావులను వెలుగులోకి తెచ్చినట్లు రచయిత, చరిత్ర పరిశోధకులు బొమ్మిశెట్టి రమేష్ గురువారం తెలిపారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ
చింతకొమ్మదిన్నె దాటి అప్పరాస పల్లె గుండా గోపాలపురం, ఓబులవారిపల్లె మీదుగా రసూల్ పల్లె బీట్ నుంచి 8 కిలోమీటర్లు ప్రయాణించి ఈ బావులను గురించి పరిశోధన చేసినట్లు చెప్పారు.
ఈ ప్రాంతంలో ఎగువన ఎర్ర రెడ్డి బావి, మధ్యలో బక్కసం బావి, దిగువన గంగుబావి ఒకే సరళరేఖ పై ఉన్నట్లు వివరించారు.
ఆ కాలానికి సాక్షాధారంగా ఇప్పటికీ బక్కసంబావి అందమైన రాజసం ఉట్టిపడుతుందన్నారు.
బావికి రెండు వైపులా మెట్లు ఉన్నాయని వెల్లడించారు.
బక్కసం బావి విస్తీర్ణంలో చాలా పెద్ద బావి అని, గంగుబావి కొద్దిగా చిన్న బావి అన్నారు.
ఈ బావులు ప్రసిద్ధ పొలతల శ్రీ మల్లేశ్వర క్షేత్రానికి వెళ్లే బాటసారులు గతంలో దాహార్తి తీర్చుకునేవారని తెలిపారు. బక్కసం బావి
పైన ఒక నీటి తొట్టి కూడా ఉందని చెప్పారు.
ఈ పరిశోధనలో కొలుములపల్లె పంచాయతీలోని లింగారెడ్డిపల్లెకు చెందిన చెన్నంరెడ్డి నాగమల్లారెడ్డి తనకు ఈ బావుల గురించి తెలిపారని వివరించారు.
ఈ రెండు బావుల ఛాయాచిత్రాలను వాట్సప్ ద్వారా పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నంరెడ్డి కి పంపగా ఇవి సదాశివరాయల కాలం నాటివని స్పష్టం చేసినట్లు వెల్లడించారు.