మోదీ కానుకగా….. 20 వేల సైకిళ్ల పంపిణీ చేయనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్

*మోదీ కానుకగా…..*

 *ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు*

*20 వేల సైకిళ్ల పంపిణీ చేయనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్*

*టెన్త్ క్లాస్ విద్యార్ధినీ, విద్యార్థులందరికీ సైకిళ్లు అందజేయనున్న కేంద్ర మంత్రి*

*ప్రతి మండలానికి అదనంగా వంద చొప్పున సైకిళ్ల సరఫరా*

*డివిజన్లకు అదనంగా 50 సైకిళ్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైన కేంద్ర మంత్రి*

*కరీంనగర్ జులై 4 ప్రశ్న ఆయుధం*

ఈనెల 11న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూళ్లలో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థినీ, విద్యార్థులతోపాటు భారీ ఎత్తున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. తన పార్లమెంట్ పరిధిలోని జిల్లాల వారీగా చూస్తే…. కరీంనగర్ జిల్లాలో పదో తరగతి చదువుకునే బాలబాలికలు 3096 మంది ఉన్నారు. రాజన్న సిరిసిల్లలో 3841, జగిత్యాల జిల్లాలో 1137, సిద్దిపేటలో 783, హన్మకొండ జిల్లాలో 491 మంది వెరసి 9348 మంది బాలబాలికలు టెన్త్ క్లాస్ అభ్యసిస్తున్నారు.

అట్లాగే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్ కు 50 చొప్పున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. వీటితోపాటు ఒక్కో మండలానికి వంద చొప్పున సైకిళ్లను అదనంగా పంపిణీ చేస్తారు. అట్లాగే హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో వార్డుకు 50కి చొప్పున పంపిణీ చేస్తారు. ఇక గ్రామ పంచాయతీల వారీగా 10 నుండి 25 సైకిళ్ల చొప్పున పంపిణీ చేయనున్నారు. వెరసి తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 20 వేల సైకిళ్లను దశలవారీగా పంపిణీ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు సైకిళ్ల తయారీలో పేరుగాంచిన ప్రముఖ సంస్థకు నెల రోజుల క్రితమే ఆర్డర్ కూడా ఇచ్చారు.

ఇప్పటికే 5 వేల సైకిళ్లు కరీంనగర్ కు వచ్చాయి. తొలి దశలో ఐదు వేల సైకిళ్లను ఈనెల 8 లేదా 9వ తేదీన పంపిణీ చేసేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. మిగిలిన సైకిళ్లు కూడా వచ్చిన వెంటనే అసెంబ్లీ నియోజకవర్గాల, మండలాల వారీగా పంపిణీ చేయనున్నారు. ఇక సైకిళ్ల ఖర్చు వివరాలకు వస్తే ఒక్కో సైకిల్ ను రూ.4 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సైకిల్ రాడ్ కు ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంకోవైపు బండి సంజయ్ ఫోటోను ముద్రించనున్నారు.

*టెన్త్ విద్యార్థులకే ఎందుకంటే….*

ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలు పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్లే ఉంటారనే విషయం తెలిసిందే. తమ ఇంటి నుండి స్కూల్ దాకా వెళ్లడానికి తగిన రవాణా సౌకర్యాల్లేక, ఆటోలు, బస్సులు వెళ్లే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా టెన్త్ క్లాస్ విషయానికొచ్చే సరికి స్కూల్ వేళలు ముగిసిన తరువాత స్పెషల్ క్లాస్ లకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనివల్ల పొద్దుపోయేదాకా స్కూళ్లోనే ఉండాల్సి వస్తుంది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని టెన్త్ బాలబాలికలకు రవాణా ఇబ్బంది ఉండకూడదనే సదుద్దేశంతో బండి సంజయ్ కుమార్ ప్రధాని మోదీ కానుకగా సైకిళ్లను పంపిణీ చేయనుండటం విశేషం.

Join WhatsApp

Join Now

Leave a Comment