ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు నిలిచిపోవడంతో రోడ్డు దుస్థితి
మంత్రి కోమటిరెడ్డి వెంటనే చర్యలకు ఆదేశం
మేడ్చల్ జిల్లా ఉప్పల్ ప్రశ్న ఆయుధం ఆగస్టు 11
ఉప్పల్–నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనులు ఏడు సంవత్సరాలుగా ముందుకు సాగకపోవడంతో వరంగల్ జాతీయ రహదారి అధ్వానంగా మారిందని, దీంతో ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మందముల పరమేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని వజ్రేష్ యాదవ్తో కలిసి కలిసిన పరమేశ్వర్రెడ్డి, వినతిపత్రాన్ని అందజేశారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కారణంగా రోడ్డు దెబ్బతిన్నదని, వర్షాలతో గుంతలు పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
దీనిపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి, ఉప్పల్ రింగ్రోడ్డు నుంచి నల్లచెరువు వరకు రోడ్డు నిర్మాణం లేదా మరమ్మత్తు పనులను జీహెచ్ఎంసీ చేపట్టేలా ఆదేశించారు. ఈ పనుల కోసం ఆర్ అండ్ బీ నుంచి ఎన్.ఓ.సి. పొందాలని పరమేశ్వర్రెడ్డి కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్కు ఫోన్ చేసి, కారిడార్ పనులతో సంబంధం లేకుండా రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించినట్లు పరమేశ్వర్రెడ్డి తెలిపారు.