అవినీతి పరున్ని నిరూపిస్తే రాజీనామా చేస్తాం..
నిజామాబాద్ ప్రశ్న ఆయుధం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 28
బాపూజీ వచనాలయంలో జరుగుతున్న పనుల్లో ఎక్కడైనా అవినీతిని నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తామని బాపూజీ వచనాలయం పాలకవర్గం అధ్యక్షుడు భక్తవత్సలం(ఢిల్లీ) తెలిపారు. శనివారం వచనాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాపూజీ వచనాలయాన్ని డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో రూ.3కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎక్కడ కూడా అవినీతి లేకుండా పనులు సాగుతున్నాయని, కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. వచనాలయానికి సంబంధించి అద్దె వసూళ్ల ద్వారా వచ్చిన డబ్బులు, షబ్బీర్ రూ.25లక్షల ఫండ్ ఇచ్చారని.. వాటితో పనులు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎంపీ అర్వింద్ రూ.5లక్షలు ఇచ్చేందుకు హామీ ఇచ్చారన్నారు. వచనాలయానికి ఎకరం 16 గుంటల భూమి ఉందన్నారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బకాయిల వసూళ్లకు ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో పాలకవర్గం ఉపాధ్యక్షులు బీడీ దాస్, భోగ అశోక్, కార్యదర్శి మీసాల సుధాకర్, సంయుక్త కార్యదర్శులు అల్లోల్ల సాంబయ్య, దత్తాద్రి, కోశాధికారి గంగాధర్ రావు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.