*పాక్ సైన్యాధిపతి మునీర్ ఎక్కడ?*
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ అహ్మద్ షా కనిపించడం లేదు! పహల్గాం ఉగ్రదాడికి ముందు హిందువులు, ముస్లింలు వేరంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన.. దాడి జరిగిన తర్వాత నుంచి ఎవరికీ కనిపించకుండా పోయారు. కనీసం మీడియా సమావేశాల్లోనూ పాల్గొనలేదు. ఆ దాడికి ప్రతీకారంగా పాక్లోని ఉగ్రస్థావరాలపై భారత దళాలు ఆపరేషన్ సిందూర్ పేరిట క్షిపణి దాడులతో విరుచుకుపడిన తర్వాత కూడా ఆయన జాడ లేకపోవడం గమనార్హం. మునీర్ ‘దేశం వదిలి పారిపోయారు’ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. హ్యాస్ట్యాగ్లు, మీమ్లు వెల్లువెత్తాయి. పాక్ ఆర్మీ చీఫ్ తన కుటుంబంతో సహా దేశం విడిచి పారిపోయారని లేదా రావల్పిండిలోని బంకర్లో దాక్కున్నారని వార్తలొచ్చాయి. విమర్శలు వచ్చాయి.
ఈ ప్రచారం ఊపందుకోవడంతో పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఏప్రిల్ 26న ప్రధానమంత్రి షెహబాజ్ షరీ్ఫతో కలిసి జనరల్ మునీర్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారంటూ ఫొటోను ఎక్స్లో పోస్ట్ చేసింది. ‘అబోటాబాద్లోని పీఎంఏ కాకుల్లో 151వ లాంగ్ కోర్సు గ్రాడ్యుయేటింగ్ అధికారులతో గ్రూప్ ఫొటోలో ప్రధాని షెహబాజ్ షరీఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్, పీఎంఏ కాకుల్ అధికారులు. ఏప్రిల్ 26, 2025’ అని ఫొటోకు శీర్షిక కూడా పెట్టింది. అయితే ఆర్మీ చీఫ్ కనిపించడం లేదన్న వార్తలను కప్పిపుచ్చడానికే ఏఐతో సృష్టించిన తప్పుడు ఫొటోను పోస్ట్ చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.