భార్య-ప్రియుడు కూటమి దారుణం
భర్తను మత్తు మందుతో చంపి.. శవానికి నిప్పు
CCTV ఫుటేజ్తో నరేశ్ హత్య కేసు ఛేదన — నిందితుల అరెస్టు, రిమాండ్
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్, పర్యవేక్షణలో ఘన విజయం;
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం)అక్టోబర్ 22
ప్రేమలో పడ్డ భార్య.. ఆమెకు అడ్డుగా మారిన భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది. శవాన్ని కాల్చి గుర్తుపట్టలేనట్టుగా మార్చింది. అయితే.. CCTV కెమెరాలు ఆ దారుణాన్ని బహిర్గతం చేశాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఘటన వివరాలు;
తేదీ 16.10.2025న గాంధారి శివారులోని చర్మల్ రోడ్డుపక్కన కాలువలో ఒక గుర్తు తెలియని మగవ్యక్తి శవం దొరకడంతో గాంధారి పోలీసులు కేసు నమోదు చేశారు. శవం దహనం చేయబడినందున మొదటగా మృతుడు ఎవరో గుర్తించలేకపోయారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు యెల్లారెడ్డి డీఎస్పీ పర్యవేక్షణలో, సదాశివనగర్ సీఐ బి. సంతోష్కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు.
పోలీసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు;
మృతుడు నరేశ్ (27), వృత్తి లేబర్, మేడ్చల్ జిల్లా కీసర మండలం భవాని నగర్ కాలనీకి చెందినవాడు. నరేశ్ భార్య ఇరగడింట్ల నవనీత కొంత కాలంగా అదే ప్రాంతానికి చెందిన ఏలూరి ఆంజనేయులు (38) అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. కూలి పనిలో ఏర్పడిన పరిచయం క్రమంగా శారీరక సంబంధంగా మారింది.
నరేశ్కు భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్తను చంపి తాము స్వేచ్ఛగా ఉండాలని నవనీత–ఆంజనేయులు పథకం వేసుకున్నారు.
పథకం ప్రకారం దారుణం;
తేదీ 15.10.2025 రాత్రి ఆంజనేయులు ఫోన్లో నవనీతకు “ఈరోజే నీ భర్తను చంపేస్తాను” అని చెప్పి నరేశ్ను రాంపల్లి చౌరస్తాకు పిలిచాడు. అక్కడ నుంచి పెద్దగుట్ట వైపుకు తీసుకెళ్లి, తిరుగు ప్రయాణంలో గాంధారి సమీపంలోని చర్మల్ రోడ్డు వద్ద మద్యం తాగించి, మత్తులో ఉన్న నరేశ్పై దాడి చేశాడు.
తలపై బలంగా కొట్టి స్పృహ కోల్పోయిన నరేశ్ ఛాతిపై చేతులు, కాళ్లతో బలంగా కొట్టి చంపేశాడు. తర్వాత సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొనుగోలు చేసి శవంపై పోసి నిప్పు పెట్టాడు.
CCTV ఫుటేజ్ కీలకం;
గాంధారి గ్రామంలో స్థానికుల సహకారంతో ఏర్పాటు చేసిన 42 CCTV కెమెరాలు ఈ కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించాయి. ఫుటేజ్లలో బైక్ల కదలికలు, సమయాలు, మార్గాలు పోలీసులకు ముక్కుసూటిగా దారితీశాయి. సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం ఆధారంగా పోలీసులు నిందితులిద్దరినీ పట్టుకున్నారు.
అరెస్టులు;
A1: ఏలూరి ఆంజనేయులు (38), ఔట్సోర్సింగ్ వాటర్మాన్, మేడ్చల్
A2: ఇరగడింట్ల నవనీత (భార్య), లేబర్, భవాని నగర్ కాలనీ, కీసర మండలం
వారి వద్ద నుండి ఒక ఫ్యాషన్ ప్రో బైక్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు.
ఎస్పీ అభినందనలు;
కేవలం వారం రోజుల్లోనే నరేశ్ హత్య కేసును ఛేదించిన
సీఐ బి. సంతోష్కుమార్, ఎస్ఐ ఆంజనేయులు, కానిస్టేబుళ్లు సంజయ్కుమార్, రవికుమార్, సాయిబాబా, ప్రసాద్ బంతిలాలు హోం గార్డులు, తదితరులను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్, అభినందించారు.
ప్రజలకు హెచ్చరిక;
జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ —
“ప్రతి కాలనీ, గ్రామంలో CCTV కెమరాలు ఏర్పాటు చేయాలి. అవి నేరాలను నివారించడంలోనే కాకుండా, నేరస్తులను గుర్తించడంలో కీలకమైన ఆధారాలుగా నిలుస్తాయి. ఈ కేసు అందుకు చక్కటి ఉదాహరణ” అన్నారు.