దుర్గం పంచాయతీ సెక్రటరీపై కార్మికుల ఆరోపణలు – ‘వేతనాల్లో భారీ తేడాలు’
గాంధారిలో మల్టీపర్పస్ వర్కర్ల ధర్నా – వేతన దోపిడీపై తీవ్ర ఆగ్రహం
దుర్గం పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ల వేతనాల దోపిడీపై ధర్నా
ఐదుగురిలో ఒక్కరికి మాత్రమే పూర్తి వేతనం – మిగతావారికి తక్కువ చెల్లింపులు
నెలకు ₹14,000 వరకు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణ
సెక్రటరీని విధుల నుండి తొలగించాలని డిమాండ్
చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్ వద్ద ఆందోళన హెచ్చరిక
గాంధారి, అక్టోబర్ 22 (ప్రశ్న ఆయుధం):
గాంధారి మండల కేంద్రంలో బుధవారం జరిగిన మహాధర్నాలో దుర్గం గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు తమ వేతనాల దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు.
సీఐటీయూ మండల కార్యదర్శి ప్రకాశ్ నాయక్ మాట్లాడుతూ, “దుర్గం పంచాయతీలో ఐదుగురు వర్కర్లు ఉన్నా, వారికి సమాన వేతనాలు ఇవ్వడం లేదు. నెలకు ₹9,500 రావాల్సి ఉన్నా కొందరికి ₹5,000–₹7,000 మాత్రమే చెల్లిస్తున్నారు,” అన్నారు.
వేతన వివరాలు ఇలా ఉన్నాయి:
తుకారాం – ₹9,500, సంతోష్ – ₹7,000,సోమ్ల – ₹6,000,శివలాల్ – ₹6,000,సాంబు – ₹5,000
ఈ తేడాల వెనుక గ్రామ పంచాయతీ సెక్రటరీ దుర్వినియోగం ఉందని ఆయన ఆరోపించారు. “ప్రతి నెలా ₹14,000 వరకు వేతనాల నుండి దోచుకుంటూ, వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నాడు. ఇలాంటి అధికారులను తక్షణమే విధుల నుండి తొలగించాలి,” అని డిమాండ్ చేశారు.
ప్రకాశ్ నాయక్ హెచ్చరిస్తూ, “సెక్రటరీపై చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపడతాం,” అన్నారు.
ఈ కార్యక్రమంలో దేవిసింగ్, తుకారాం, సాంబు, శివలాల్, సంతోష్, సోమ్ల, రాజు తదితర వర్కర్లు పాల్గొని నినాదాలతో కేంద్రాన్ని మార్మోగించారు.
“కార్మికుల చెమటతో వచ్చిన వేతనం దోపిడీ చేసే వారిని వదలము” – నిరసనకారుల హెచ్చరిక