గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 13 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి దమ్మపేట అశ్వరావుపేట ప్రాంతాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశానని, ఆది నుంచి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ఎజెండాగా ముందుకు సాగుతున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం దమ్మపేట మండలంలో అల్లిపల్లి గ్రామంలో రూ.20 లక్షలతో ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ భవనం,రూ. 29 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రహదారితో పాటు కల్వర్టు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం అల్లిపల్లి గ్రామంలో గ్రామస్తులు స్వయంగా నిర్మించుకున్న ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ నా రాజకీయ జీవితంలో ఎన్నో పదవులను కట్టబెట్టిన సొంత మండలం దమ్మపేట అభివృద్ధి కోసం ఆది నుంచి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దమ్మపేట, అశ్వరావుపేట ప్రజల ఆశీర్వాదం వల్లనే ఈరోజు అన్ని ప్రభుత్వాల్లో మంత్రిగా కొనసాగే భాగ్యం కలిగిందన్నారు. ఇక్కడి రైతులు పామాయిల్ రంగంలో రాణిస్తూ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. ఈ ప్రాంతాల అభివృద్ధిని చూసి పక్క రాష్ట్ర ప్రజలు సైతం మెచ్చుకుంటున్నారని, దమ్మపేటను ఆ రోజుల్లోనే ఆదర్శంగా తీర్చిదిద్దామని స్వయంగా ఎన్టీ రామారావు అభినందించారని చెప్పారు.
ఈ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు నివసిస్తున్నారని గిరిజనుల భూముల్లో గిరిజనలే వ్యవసాయం చేసుకోవాలని, గిరిజనేతరులు సాగు చేయడానికి వీలులేదని అన్నారు. ఇక్కడ రైతులు ఎవరి భూముల్లో వారే సాగు చేసుకుంటున్నారని వాటికి హక్కు కల్పించాల్సిన అవసరం అధికారులకు ఉందన్నారు. దశాబ్దాలుగా రాజకీయ రంగంలో కష్టపడి పని చేస్తూ ప్రజలకు కావలసిన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులను కల్పించి వారి అవసరాలను తీర్చానని మంత్రి అన్నారు. ఈ ప్రాంతాల అభివృద్ధి కోసం మరిన్ని నిధులను తీసుకువచ్చి ప్రతి మారుమూల గ్రామానికి రహదారి సౌకర్యాన్ని కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ఆయన అన్నారు.
అనంతరం అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి లో భాగంగా రైతులకు అవసరమైనటువంటి గ్రావెల్ రోడ్లు, మెటల్ రోడ్లు వేయడానికి గాను సుమారు రూ,,25 కోట్ల 66 లక్షల రూ,,48 వేల 375 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మంజూరు అయిన పనులు అన్నిటిని మార్చి నెల లోపల పూర్తి చేయాలన్నారు. ఇంకా ఎవరైనా రైతులు తమ పొలాలకు వెళ్ళు పొలం బాట అవసరమైనచో సంబంధిత ఎంపీడీవో కార్యాలయం లేదా పంచాయతీ కార్యాలయాల్లో లిఖితపూర్వకంగా దరఖాస్తు చేయాలని తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయరంగ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈవో నాగలక్ష్మి ,కొత్తగూడెం ఆర్డీవో మధు, పంచాయతీరాజ్ కాశయ్య,ఆలపాటి ప్రసాద్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.