సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జనవరి 01 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యను జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బంది,ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన సంవత్సరం అందరికీ ఆరోగ్యం, ఆనందం, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో బాధ్యతాయుతంగా, అంకిత భావంతో పని చేయాలన్నారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, లక్ష్యాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలని కలెక్టర్ కోరారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా పని చేయాలన్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులు జిల్లా కలెక్టర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులు అందజేసి, క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, జీవితంలో మంచి స్థానంలో నిలవాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ పాండు, జడ్పీ సీఈవో, ఇన్చార్జి డీపీవో జానకి రెడ్డి, డీడబ్ల్యుఓ లలిత కుమారి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అఖిలేష్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి జగదీష్, జిల్లా యువజన సంక్షేమ అధికారి కాసిం బేగ్, వసతి గృహ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అంకిత భావంతో పని చేయాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Published On: January 1, 2026 5:36 pm