సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఒత్తిడిని దూరం చేసి, భావోద్వేగాలను నియంత్రిస్తూ.. శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా మార్చే దివ్యఔషధమే యోగా అని, ప్రతి రోజు చేసే యోగ శరీరానికి ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని స్థితప్రజ్ఞతను అందిస్తుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. శనివారం అంతర్ జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ఇషా ఫౌండేషన్ నుండి సుమిట్ పాటిల్, డా. మోహినీ హాజరై జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో యోగా ఆసనాలు, ధ్యానం, శ్వాస పైన ధ్యాస, సూర్య నమస్కారాలు, ప్రాణాయామము, తదితర ఆసనాలు చేయించడం జరిగిందన్నారు. జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఈ రోజు ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో ఈ రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. యోగా విజ్ఞానం శరీరం పైననే కాదు మనసు పైన కూడా పట్టు సాధించడం యోగా లక్ష్యం అని, స్వామి వివేకానంద వారు చెప్పినట్లు విరోచిత కార్యం తొణికసలాడె జీవకల, ఆశావాహ దృక్పథం, ఇవన్నీ శక్తి సాంకేతికాలు అన్నారు. జిల్లా ప్రజలకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జూన్ 26 మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించునున్న వారోత్సవాలను విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరూ డ్రగ్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా పోవలీసు అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవరావు, డీటీసీ అదనపు ఎస్పీ శ్రీనివాస రావు, డియస్పీలు సత్యయ్య గౌడ్, నరేందర్, సురేందర్ రెడ్డి, ఆర్.ఐ రామారావు, రాజశేఖర్ రెడ్డి, డానియోల్, ఇన్స్పెక్టవర్స్ రమేశ్, నాగేశ్వర్ రావు, కిరణ్, రమేష్, సుమన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.