*రాష్ట్రంలో ప్రసిద్ధ దేవాలయాలకు కల్తీ నెయ్యిని సరఫరా చేయించిన భోలేబాబా డెయిరీ – ఏసీబీ కోర్టులో ఏపీపీ వాదనలు*
తిరుమలలోని లడ్డూ ప్రసాద తయారీకి కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేస్తోన్న విచారణలో ఆశ్చర్యకర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డెయిరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డెయిరీని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు కల్తీ నెయ్యిని పంపినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రముఖ దేవాలయాలకూ కల్తీ నెయ్యి: విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకూ భోలేబాబా సంస్థనే పరోక్షంగా నెయ్యిని సరఫరా చేయించినట్లు నిర్ధరణకు వచ్చారు. తిరుపతిలో డెయిరీకి కమీషన్లు చెల్లించి ఆ కంపెనీ పేరుతోనే కల్తీ నెయ్యిని పంపినట్లు అధికారులు విచారణలో తేల్చారు. ఇప్పటివరకు టీటీడీకి మాత్రమే కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని అంతా భావిస్తున్నారు.
ఈ తరుణంలో ఏ12గా ఉన్న భోలేబాబా డెయిరీ జనరల్ మేనేజర్ హరిమోహన్ రాణా నెల్లూరు ఏసీబీ కోర్టులో మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఏపీపీ జయశేఖర్ వ్యతిరేకిస్తూ ఈనెల 17న వినిపించిన వాదనల సందర్భంగా ఈ ఆశ్చర్యకర విషయాలు బయటపడ్డాయి. కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితుడు మాస్టర్మైండ్ అని, బయటకు పొక్కితే సాక్ష్యాధారాలు మాయం చేస్తాడని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏపీపీ వాదించగా ఏకీభవించిన న్యాయమూర్తి సరస్వతి గురువారం బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు
సుగంధ ఆయిల్స్,పామోలిన్ వినియోగం: ఉత్తరాఖండ్లోని భోలేబాబా డెయిరీని 2022లో టీటీడీలో బ్లాక్లిస్ట్లో పెట్టిన తర్వాత ‘మాల్గంగ’ అనే డెయిరీని తెరపైకి తీసుకొచ్చింది. ఈ కంపెనీకి కమీషన్ చెల్లించి సుగంధ ఆయిల్స్, పామోలిన్ తదితర పదార్థాలతో తయారుచేసిన కల్తీ నెయ్యిని పరోక్షంగా భోలేబాబా డెయిరీనే టీటీడీకి పంపిందని వాదనల సందర్భంగా ఏపీపీ పేర్కొన్నారు. కొన్నిసంస్థల దగ్గర నెయ్యి కొనుగోలు చేసి టీటీడీకు సరఫరా చేశామని హరిమోహన్ రాణా గతంలో తెలిపారని అధికారుల విచారణలో ఇదంతా అవాస్తమని తేలిందని వెల్లడించారు.