బీ.సీ కమిషన్ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు: అదనపు కలెక్టర్ చంద్రశేఖర్

బీ.సీ
Headlines:
  1. బీసీ కమిషన్ పర్యటన కోసం సంగారెడ్డిలో పకడ్బందీ ఏర్పాట్లు
  2. రిజర్వేషన్లపై ప్రజాభిప్రాయ సేకరణ – అదనపు కలెక్టర్ సూచనలు
  3. బీసీ కమిషన్ పర్యటన: హెల్ప్ డెస్క్, సురక్షిత ఏర్పాట్లు
సంగారెడ్డి ప్రతినిధి, (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం ఈ నెల 30న సంగారెడ్డి జిల్లాకు విచ్చేయనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులకు సూచించారు. బీ.సీ కమిషన్ పర్యటనను పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆయా శాఖల అధికారులకు వారు నిర్వర్తించాల్సిన విధుల గురించి, బాధ్యతలను వివరించారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ నెల 30న సంగారెడ్డిలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలోని బీసీ కమిషన్ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల దామాషాపై అభిప్రాయాలు సేకరిస్తుందని అన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వారు రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను కమిషన్ కు నివేదించవచ్చని తెలిపారు. అభిప్రాయాల సేకరణ కోసం విచ్చేస్తున్న బీ.సీ కమిషన్ పర్యటన గురించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. కమిషన్ పర్యటనను పురస్కరించుకుని ఆయా శాఖల వారీగా అధికారులు, సిబ్బందికి కేటాయించిన విధులను తు.చ తప్పకుండా పాటించాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగానే పూర్తి చేసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. అత్యంత కీలకమైన అంశంపై కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ జరుపనున్న దృష్ట్యా, ఈ ప్రక్రియకు ఎక్కడ కూడా ఏ చిన్న అవాంతరం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. తమ అభిప్రాయాలను కమిషన్ కు నివేదించేందుకు హాజరయ్యే వారికి సహకరించేందుకు వీలుగా హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ హెల్ప్ డెస్క్ ల వద్ద సరిపడా సిబ్బందిని, అవసరమైన స్టేషనరీని అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అభిప్రాయాలు తెలియజేయాలనుకునే వారు రాతపూర్వక సమర్పణలు, అభ్యర్థనలను నేరుగా సమర్పించవచ్చని సూచించారు. వారి అభ్యర్థనలతో పాటు నిర్దేశిత నమూనాలో వెరిఫికేషన్ అఫిడవిట్ ఆరు సెట్లను అందజేయాల్సి ఉన్నందున రిజిస్ట్రేషన్, హెల్ప్ డెస్క్ విభాగాల వద్ద విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం వినతి పత్రాలతో కూడిన పూర్తి వివరాలు, వీడియోలు, ఫోటోగ్రాఫ్స్ తదితర వాటిని కమిషన్ కు సమర్పించాల్సి ఉన్నందున అన్నింటినీ జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. సన్నాహక సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now