కామారెడ్డిలో మున్సిపల్ భూములపై అక్రమ కబ్జాలకు చెక్
– ఉదయం నుంచే భారీ ఎత్తున తొలగింపు
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా డిసెంబర్ 01
కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ ప్రాంతం సర్వే నెంబర్–6లో మున్సిపాలిటీకి చెందిన స్థలాన్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకొని ఎన్నాళ్లుగానో వ్యాపారాలు నిర్వహిస్తూ కబ్జాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, మున్సిపాలిటీ పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 6 గంటల నుంచే ఆక్రమణల తొలగింపు చర్యలు ప్రారంభించారు.
జెసిబిల సాయంతో విస్తృతంగా సాగిన ఈ ఆపరేషన్లో, మున్నూరు కాపు సంఘానికి కోర్టు నుండి స్టే ఉన్నందున వారి భవనాన్ని మినహాయించి, మిగతా అన్ని ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. ఖాళీ చేసిన మున్సిపల్ స్థలాన్ని స్వాధీనపరచుకొని త్వరలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
ఇకపై మున్సిపల్ లేదా ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించినట్లయితే కఠిన చర్యలు తప్పవని సంబంధిత శాఖలు హెచ్చరించాయి.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కామారెడ్డి, ఎమ్మార్వో, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, కామారెడ్డి ఎస్హెచ్ఓ, మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ఆర్ & బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.