నాలుగేళ్ల పాటు సహజీవనం చేసిన ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని ఆరోపిస్తూ ఆగ్రాలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నేపథ్యంలో, మహిళతో సహజీవనం చేసిన కానిస్టేబుల్ను పోలీసులు సస్పెండ్ చేశారు.
తాజ్గంజ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న జేవీ గౌతమ్ అనే వ్యక్తితో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు బాధితురాలు ఆరోపించారు. అయితే, గౌతమ్ ఇటీవలే మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని, ఇది తనను మోసం చేయడమేనని ఆమె పేర్కొన్నారు. ఇన్నాళ్లుగా భార్యాభర్తల్లా జీవించినా, చివరికి పెళ్లికి నిరాకరించడం దారుణమని వాపోయారు.
ఆత్మహత్యకు ముందు మహిళ రికార్డ్ చేసిన వీడియోలో, గౌతమ్ తనను మానసికంగా వేధించాడని, తనకు వేరే మార్గం లేకుండా చేశాడని ఆరోపించారు. తన మరణానికి గౌతమ్, అతని కుటుంబమే కారణమని పేర్కొంటూ, మరణానంతరమైనా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. బాధితురాలి వీడియోలు, ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు కానిస్టేబుల్ జేవీ గౌతమ్ను సస్పెండ్ చేశారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కాస్గంజ్ జిల్లాకు చెందిన ఈ మహిళకు గతంలో వివాహం కాగా, విడాకులు తీసుకున్నారని సమాచారం. ఆగ్రాలో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే కానిస్టేబుల్ గౌతమ్తో పరిచయం ఏర్పడింది.

