గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి…
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 23 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. శనివారం ఐడిఓసీ కార్యాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, అగ్నిమాపక, విద్యుత్, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకావాలని అన్నారు. అన్ని గణేష్ మండపాలను తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ముందస్తుగా గణేష్ మండలి నిర్వాహకులు పూర్తి వివరాలు అందించాలని, ఇది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండల స్థాయిలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు నుండి నిమజ్జనం వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రశాంత వాతావరణంలో అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా నిర్వహించాలని చెప్పారు. మండపాలకు విద్యుత్ ఏర్పాటుకు తప్పని సరిగా విద్యుత్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని చెప్పారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలుపై విద్యుత్ అధికారులు మండపాల్లో ఆడిట్ నిర్వహించాలని చెప్పారు. విద్యుత్ తీగలకు తగల కుండా ఎత్తు తక్కువ ఉండే విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. మండపాల్లో మైక్ ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలని చెప్పారు. మన జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి నిమజ్జనానికి విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్నందున యంత్రాంగం సూచించిన ప్రాంతాల్లో మాత్రమే అత్యంత భద్రత మధ్య నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. గణేష్ నిమజ్జనానికి పకడ్బందీప్రణాళికరూపొందించుకోవాలని, గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసుకునేందుకు అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని చెప్పారు. నిమజ్జనం రూట్ లో అవసరమైన రోడ్డు మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. వినాయక నిమజ్జనానికి వినియోగించే వాహనాలను ముందస్తుగా రవాణాశాఖ అధికారి నుండి ధ్రువీకరణ తీసుకోవాలని చెప్పారు. ప్రతి గణేష్ మండపం వద్ద అవసరమైన మేర బందోబస్తు ఏర్పాటు చేయాలని, గణేష్ నిమజ్జనం సజావుగా జరిగే విధంగా కట్టు దిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాట్లుచేయాలని కలెక్టర్ సూచించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తిపాటలు మాత్రమే వినిపించాలని, మతాలు, వర్గాల మనోభావాలను గౌరవించాలని చెప్పారు. అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి రెచ్చగొట్టే అంశాల జోలికి వెళ్లవద్దని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా క్రేన్లు వినియోగించాలని, గణేష్ నిమజ్జనం జరిగే ప్రదేశాలలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సహకారంతో కలిసికట్టుగా పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని చెప్పారు. భక్తులకు అందించే స్వామి వారి ప్రసాదాలకు ప్లాస్టిక్ వస్తువులు వినియోగించొద్దని పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని చెప్పారు. వ్యర్థాలు వేసేందుకు డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలని, రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసే విగ్రహాలు పర్యావణానికి హాని కలిగిస్తాయన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో ఉచిత మట్టిగణపతులు పంపిణీ చేయనున్నామని, ప్రజలు మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజ్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాళ్ శ్రేష్ఠ, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్,అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ శ్రీమతి విద్యా చందన,డిపిఓచంద్రమౌళి,డీఎంహెచ్ఓ విజయలక్ష్మి, మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, కొత్తగూడెం, ఆర్డీవో మధు,మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు…