సంగారెడ్డి ప్రతినిధి, డిసెంబరు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికి తీసి జాతీయ అంతర్జాతీయ పోటీలకు సిద్ధం చేయడం కోసం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వల్లూరు కలెక్టర్ క్రాంతి అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను, ఎన్ సీసీ విద్యార్థుల, క్రీడాకారుల కవాతు, గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జ్యోతి వెలిగించి సీఎం కప్ క్రీడలను క్రాంతి లాంఛనంగా ప్రారంభించారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టాస్ వేసి కబడ్డీ పోటీలను ప్రారంభించిన టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, వాలీబాల్ ఆటను టాస్ వేసి జిల్లా కలెక్టర్ క్రాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలకు 27 మండలాలు, 8 మున్సిపాలిటీలు క్రీడలలో పాల్గొనడం జరిగిందన్నారు. వాటిలో ఖోఖో, కబడ్డీ, యోగా, చెస్ లలో 1000 మంది క్రీడా కారులు పాల్గొనడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారని వారికి అవకాశాలు లేక వారి ప్రతిభ ప్రపంచానికి తెలియకుండా పోయిందన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు రూపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. క్రీడలు మానసికల్లాసానికి శరీర దృఢత్వానికి క్రమశిక్షణకు తోడ్పడుతాయన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు చదువులో కూడా ప్రతిభ కనబరుస్తారన్నారు. ప్రతి ఒక్కరూ చదువుతోపాటు వారికి ఇష్టమైన ఏదో ఒక క్రీడలు రాణించాలని కలెక్టర్ సూచించారు. తాను సైతం బాస్కెట్ బాల్, జిల్లా స్థాయి టోర్నమెంట్లు పాల్గొన్నట్లు అనంతరం కాలేజీ స్థాయిలో బ్యాడ్మింటన్, టెన్నిస్ పోటీల్లో పాల్గొన్నట్లు కలెక్టర్ తెలిపారు. గెలుపు ఓటములను సమంగా స్వీకరించాలన్నారు. గెలుపుతో పొంగిపోవద్దని ఓటమితో కూంగిపోవద్దని గెలుపు కోసం ప్రయత్నించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. జాతీయస్థాయి క్రీడలలో పాల్గొని ఎక్కువ పథకాలు తేవడమే ముఖ్యఉద్దేశమని అన్నారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సంగారెడ్డి పట్టణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం గ్రామీణ యువతలోని ప్రతిభను వెలికితీయడం. ప్రతిభావంతులను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లడం ద్వారా దేశానికి పతకాలు సాధించడమే ప్రభుత్వ లక్ష్యం అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ మనోజ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జిల్లా లైజనింగ్ ఆఫీసర్ ఫర్ స్టేట్ లెవెల్, టీఎన్ జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ, స్కూల్ గేమ్స్ జిల్లా సెక్రెటరీ అమూల్యమ్మ, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు,పీడీలు, పీఈటీలు, డీఎస్ ఏ సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.