రాజంపేట మండలం తలమడ్ల గ్రామ ప్రాథమిక పాఠశాలకు ఎస్ఆర్ హాచరీస్ గ్రూప్ సుమారు రూ. 2.5 లక్షల విలువైన ఫర్నిచర్, కంప్యూటర్, వాటర్ ఫిల్టర్ వంటి సామగ్రిని విరాళంగా అందజేసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్ కుమార్ గౌడ్ అభ్యర్థన మేరకు ఈ సహాయం అందింది.
ఎస్ఆర్ హాచరీస్ గ్రూప్ మేనేజ్మెంట్ తరఫున జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి చొరవతో 24 డ్యూయల్ డెస్క్లు, 5 క్లాస్రూమ్ టేబుల్స్, ఒక కంప్యూటర్, ప్రింటర్ (స్కానర్, జీరోక్స్ సదుపాయంతో), ఒక ఆర్ఓ వాటర్ ఫిల్టర్, 10 ఆఫీస్ కుర్చీలు పాఠశాలకు అందించారు. ఈ పరికరాలు విద్యార్థుల అభ్యసనానికి, పాఠశాల కార్యకలాపాలకు తోడ్పడతాయి.
ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామస్థులు, పాఠశాల సిబ్బంది ఎస్ఆర్ హాచరీస్ గ్రూప్ అధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రూప్ జీఎం సుధాకర్ రెడ్డి, మేనేజర్లు ఒబ్లేష్, శివకుమార్, శ్రీనివాస్లకు గ్రామస్థుల తరఫున, పాఠశాలల తరఫున సన్మానం నిర్వహించారు. ఇది సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచింది.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్ణాల లక్ష్మి జగదీష్, ఉపసర్పంచ్ నర్మల వెంకట్, మండల విద్యాధికారి పూర్ణచందర్, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి సహకారాలు ఎంతో అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు.
అనంతరం సర్పంచ్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మండల విద్యాధికారి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, దాని నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.












