గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుద‌ల‌..

గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుద‌ల‌ !

IMG 20241014 WA0097 1

గ్రూప్‌-1 మెయిన్స్‌ (Group 1 Mains) హాల్ టికెట్ల‌ను టీజీపీఎస్సీ సోమ‌వారం మ‌ధ్యాహ్నం విడుద‌ల చేసింది. హాల్ టికెట్ల‌ను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన‌ట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 21 ఉద‌యం వ‌ర‌కు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయ‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్(హెచ్‌ఎండీఏతో సహా) పరిధిలో అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి.

 

563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రిలిమ్స్‌ పరీక్షలను నిర్వహించి ఫలితాలను కూడా విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే గైడ్‌లైన్స్‌ కూడా విడుదల చేసింది. తొలిరోజు తీసుకెళ్లిన హాల్ టిక్కెట్‌నే మిగిలిన ఆరు పరీక్షలకు తీసుకెళ్లాలని.. రోజుకో కొత్త హాల్ టిక్కెట్‌తో వెళితే అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ప్రతిపరీక్ష రోజు హాల్ టిక్కెట్‌పై తప్పనిసరిగా సంతకం చేయాలని తెలిపింది. నియామక ప్రక్రియ పూర్తి అయ్యేవరకు హాల్‌ టికెట్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించింది.

 

కాగా, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు సంబంధించి దాఖలైన పలు కేసులపై హైకోర్టు తుది తీర్పును మంగళవారం వెలువరించనున్నది. ఆయా కేసుల్లో ఇప్పటికే విచారణను పూర్తిచేసిన హైకోర్టు తీర్పును మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తీర్పునివ్వనుంది. ఈ తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొన్నది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫైనల్‌ ‘కీ’లో తప్పులున్నట్టు తాము ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించామని, కాబట్టి తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అభ్యర్థులు భావిస్తున్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని, వికీపీడియా, గూగుల్‌ ఆధారంగా ఫైనల్‌ ‘కీ’ని రూపొందించామని టీజీపీఎస్సీ హైకోర్టుకు తెలపడం వంటి అంశాలు తమకు అనుకూలంగా మారతాయని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు.

 

గ్రూప్‌-1పై హైకోర్టులో 15కుపైగా కేసులు ఉన్నాయి. వీటిలో ఫైనల్‌ ‘కీ’పై వేసిన కేసు అత్యంత కీలకమైనది. వీటితోపాటు ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో-33పై దాఖలైన కేసు, గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి 503 పోస్టులు, కొత్త నోటిఫికేషన్‌లో అదనంగా చేర్చిన 60 పోస్టులకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి అవకాశం ఇవ్వాలన్న అంశంపై వేసిన కేసు, హైకోర్టు మళ్లీ రీ ఎగ్జామ్‌ నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో, పాత నోటిఫికేషన్‌ను రద్దుచేసి కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వడంపై వేసిన కేసులపై కూడా తీర్పు రానున్నది. ఈ నెల 16న రిజర్వేషన్లపై వేసిన మరో మూడు కేసులు సైతం హైకోర్టు ముందు విచారణకు రానున్నాయి..

Join WhatsApp

Join Now