ఇంద్రేశంలో అక్రమ నిర్మాణాల జోరు..

*మున్సిపాలిటీ అవుతుందన్న ప్రచారంతో ఇష్టానుసారంగా ఇంటి నెంబర్ల కేటాయింపు*

*అధికారుల ప్రోత్సాహంతో వందల సంఖ్యలో నిర్మాణాలు*

*నోటీసులతో సరిపెడుతున్న అధికారులు*

*అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొన్న వారి పరిస్థితి అయోమయం*

*పటాన్ చెరు మండలంలో అస్తవ్యస్తంగా ప్రత్యేక అధికారుల పాలన*

*స్పందించని జిల్లా అధికారులు*

*అధికారులపై సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్తుల డిమాండ్*

IMG 20250521 222221
సంగారెడ్డి/పటాన్ చెరు, మే 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు మండలంలోని ఇంద్రేశం గ్రామం మున్సిపాలిటీ అవుతుందన్న ప్రచారంతో, అక్రమ నిర్మాణాలకు మార్గం సుగమమవుతోంది. ఇక్కడ అధికారులు ఇష్టానుసారంగా ఇంటి నెంబర్లు కేటాయిస్తున్నారని, అనుమతుల మేరకు కాకుండా బహుళ అంతస్తుల కట్టడాలకు అదనపు అంతస్తులు జోడించేందుకు మౌనంగా సహకరిస్తున్నారని స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ప్రత్యేక అధికారుల పాలన పూర్తి స్థాయిలో అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో, అధికారుల తీరు ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇళ్ల నిర్మాణాలకు నంబర్లు కేటాయించడంలో ప్రామాణికతలేమి కనిపిస్తోందని, అనుమతులు లేని నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చి తమ బాధ్యతలు తీరినట్లు చేతులు దులుపుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ చర్యల వల్ల బిల్డర్లకు అవకాశాల బీభత్సం ఏర్పడింది. అనుమతుల్లేని కట్టడాలను కూల్చివేయడంలో అధికారులు ఉద్దేశపూర్వకంగా అలసత్వం చూపుతున్నారు. గ్రామస్థుల మాటల్లో చెప్పాలంటే, ఈ కట్టడాల్లో ప్రజలు బతుకుతెరువు కోసం గృహాలు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఇంద్రేశం గ్రామంలో అనేక అక్రమ నిర్మాణాలు నడుస్తున్నా, జిల్లా అధికారులు ఒక్కసారి కూడా స్పందించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది చూస్తే మండల స్థాయిలో ఉన్న అధికారులు బిల్డర్ల అండదండలతోనే పని చేస్తున్నారని స్పష్టమవుతోంది. అక్రమ నిర్మాణాలను ఆపేందుకు, నిర్మాణ ప్రారంభ దశలోనే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, బహుళ అంతస్తుల అక్రమ కట్టడాల వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితులన్నీ కలెక్టర్, అదనపు కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాలని, ఇప్పటికే ప్రారంభమైన కట్టడాలపై సమగ్ర విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాబోయే రోజుల్లో ఇంద్రేశం నిర్మాణాల మాఫియాకు కేంద్రంగా మారే అవకాశం ఉందని వినిపిస్తున్నాయి. వెంటనే చర్యలు తీసుకోకపోతే అక్రమ నిర్మాణాల ఈ ముప్పు నియంత్రణకు అందని దారిలోకి వెళ్లే ప్రమాదం ఉందని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment