పరిశ్రమ ఘటన చాలా బాధాకరం: ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో చోటుచేసుకున్న ప్రమాదం హృదయవిదారకమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా అన్ని శాఖలు వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు. మూడు అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయిందని, ప్రమాద సమయంలో సుమారు 65 మంది కార్మికులు అక్కడ పని చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారని తెలిపారు. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు సమాచారం అందిందని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, చికిత్స పూర్తిగా ఉచితంగా అందించే బాధ్యత మా ప్రభుత్వానిదని అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రతి కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయదని మంత్రి స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతున్నదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. 

Join WhatsApp

Join Now

Leave a Comment