సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 27 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణా ఉద్యమ కారుడు అని, స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని, ఆయనను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. శనివారం సంగారెడ్డి జడ్పీ సమావేశ మందిరంలో ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… స్వాతంత్ర సమర యోధుడుగా, తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. వారి సేవలను స్మరించుకుంటూ జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. 1969వ సంవత్సరంలో తొలి దశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి అండగా దీక్షను చేయడమే కాకుండా తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి ఉద్యమానికి అండగా నిలిచిన మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ అని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడిన యోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ తనకంటూ ఏమి లేకుండా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తన ఆస్తులు దానం చేసిన త్యాగశీలి అని చెప్పారు. ఆయన తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకు, బడగు బలహీన వర్గాల అభివృద్దికి కృషి చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల సేవలను గుర్తించి అనేక కార్యక్రమాలను అధికారికంగా జరపడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Published On: September 27, 2025 6:19 pm