మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి శుక్రవారం దమ్మాయిగూడలోని పి.ఎస్. రావు నగర్ మరియు భవానీ నగర్ కాలనీలను సందర్శించి, పారిశుద్ధ్యం మరియు టౌన్ ప్లానింగ్ అంశాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ పర్యటనలో, కమిషనర్ కాలనీల్లోని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి, శానిటేషన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రతలో నిర్లక్ష్యం వహించరాదని, చెత్త సేకరణ, డ్రైనేజీ నిర్వహణను క్రమం తప్పకుండా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
టౌన్ ప్లానింగ్ విభాగంపై దృష్టి సారించిన కమిషనర్, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలపై కన్నెర్ర చేశారు. అక్రమ నిర్మాణాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్ శ్రీమతి వసంత, ఇతర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ పర్యటన సాగిందని అధికారులు తెలిపారు.











