శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ సర్కిల్లో, జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా ఐదు అంతస్తుల భవన నిర్మాణం జరుగుతున్నా, టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చందనగర్ డివిజన్ లో జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో టౌన్ ప్లానింగ్ అధికారుల వైఖరిపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణదారుడు అధికారులకు ముడుపులు అందించి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పలుమార్లు ఫిర్యాదులు అందినప్పటికీ, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, జీహెచ్ఎంసీ చట్టాన్ని పట్టించుకోకుండా జరుగుతున్న నిర్మాణాన్ని చూసీచూడనట్లు వదిలేశారని స్థానికులు పేర్కొన్నారు. ఈ నిర్లక్ష్యం వెనుక అవినీతి ఉందని వారు అనుమానిస్తున్నారు.
నిర్మాణదారుడు అధికారులను 'మేనేజ్' చేస్తూ, అక్రమ కట్టడాన్ని సజావుగా ముందుకు తీసుకువెళ్తున్నట్లు సమాచారం. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా స్పందన లేదని, టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు తెలిపారు. ఈ అక్రమ నిర్మాణం వలన తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కనీసం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ (డిసి) అయినా ఈ విషయంలో జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. డిసి స్పందించని పక్షంలో, జోనల్ కమిషనర్ (జెడ్సి) అయినా చొరవ తీసుకోవాలని వారు అభిప్రాయపడుతున్నారు.











