సంగారెడ్డి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అభినందించారు.
సంగారెడ్డి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, టోర్నమెంట్ ఆసాంతం హోరాహోరీగా సాగిందని, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో, ఉత్తమ ప్రతిభను ప్రదర్శించారని పేర్కొన్నారు.
క్రీడలు పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. గెలుపు ఓటములు సహజమని, గెలిచిన వారు రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపాలని, ఓడిన వారు దీనిని ఒక పాఠంగా భావించి, విజయానికై కృషి చేయాలని ఎస్పీ సూచించారు.
టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను మునుముందు జరిగే రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపిక చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఆయన మెడల్స్, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేసి, అభినందించారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, ఎన్-9 బాడ్మింటన్ కోర్ట్ ఓనర్ నాగరాజు, జిల్లా ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












