సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక సంబరాలు జరిగాయి. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఈ వేడుకల్లో పాల్గొని, సిబ్బందితో కలిసి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు, పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
జిల్లా పోలీసు గ్రౌండ్స్లో నిర్వహించిన హోలీ కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్ స్వయంగా పాల్గొని, అధికారులకు, సిబ్బందికి రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగను ఆనందోత్సాహాల నడుమ, సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలని ఆయన సూచించారు.
బలవంతంగా రంగులు పూయడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి చర్యలకు పాల్పడరాదని, అలాగే మద్యం సేవించి నీటి వనరుల వద్దకు వెళ్లరాదని ఎస్పీ హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
నిత్యం విధి నిర్వహణలో ఉండే పోలీసు సిబ్బందిలో ఉత్సాహం నింపేందుకు ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు జిల్లా ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, టౌన్ ఇన్స్పెక్టర్ రాము నాయుడు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ రెడ్డి, ఆర్ఐలు డానియెల్, రాజశేఖర్, ఆర్మూడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


