వరుస సెలవుల నేపథ్యంలో, ఉగాది మరియు రంజాన్ పండుగలను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, కొన్ని ప్రత్యేక బస్సులకు టికెట్ ధరలను పెంచగా, మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుంది.
ఉగాది మరియు రంజాన్ పండుగలకు వరుస సెలవులు వస్తుండటంతో, సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులను గమ్యస్థానాలకు క్షేమంగా చేరవేసేందుకు టీజీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఈ పండుగ సెలవులకు ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ముఖ్యంగా మార్చి 17, 18 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారు. అలాగే, మార్చి 23వ తేదీన తిరుగు ప్రయాణంలోనూ రద్దీకి తగిన ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేక బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం 2003లో జీవో నంబర్ 16ను జారీ చేసింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే టికెట్ ధరలను 1.5 రెట్లు వరకు సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది. ఈ ఉగాది, రంజాన్ పండుగ సెలవులకు నడిపే ప్రత్యేక బస్సులకు ఈ జీవో ప్రకారం రూ.1.5 వరకు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించింది.
ఈ సవరించిన చార్జీలు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే వర్తిస్తాయి. మార్చి 17, 18 తేదీలతో పాటు, తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 23వ తేదీన మాత్రమే సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయి. ప్రత్యేక బస్సులు మినహా, రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయి.
రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా, ఉగాది, రంజాన్ పండుగల రోజుల్లో నడిచే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుంది. ప్రయాణికులు తమ సీట్లను www.tgsrtcbus.in వెబ్ సైట్ లో ముందస్తుగా రిజర్వ్ చేసుకోవాలని యాజమాన్యం సూచించింది.











