తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేం.నరేందర్ రెడ్డిని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ లోని వేం.నరేందర్ రెడ్డి నివాసానికి చేరుకున్న నీలం మధు, ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కలయిక రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ, వేం.నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీటు దక్కడం ఆయన నమ్మకానికి దక్కిన గౌరవం అని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీలో సిద్ధాంతాల కోసం కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని మరోసారి నిరూపితమైందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ఒక విజయంగా అభివర్ణించిన నీలం మధు, వేం.నరేందర్ రెడ్డి వంటి అనుభవజ్ఞులైన నాయకులు రాజ్యసభలో తెలంగాణ గళాన్ని బలంగా వినిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వారి అనుభవం రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బొల్లారం మాజీ కౌన్సిలర్ గుండ్ల మహేందర్ రెడ్డి, ఇస్నాపూర్ కౌన్సిలర్ సంగనగారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా వేం.నరేందర్ రెడ్డిని అభినందించి, ఆయనకు మద్దతు తెలిపారు.












