పర్యావరణానికి హాని కలిగించని మట్టి వినాయకులను ప్రతిష్టిద్దాం: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగలను పురస్కరించుకొని జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఆయా మండల కేంద్రాలలో వివిధ మతాలకు చెందిన పెద్దలు, కమ్యూనిటీ నాయకులతో పీస్ కమిటీలు నిర్వహించడం జరిగిందని, సాంప్రదాయాలను మరొకరు గౌరవించి, శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలిగించని, మట్టి వినాయకులను ప్రతిష్టించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. వినాయక ప్రతిమను ప్రతిష్టించదలచిన వారు సంగారెడ్డి జిల్లా పోలీసులకు ఆన్ లైన్ లో సమాచారం అందించాలన్నారు. యస్.హెచ్.ఓ.లు ప్రతి మండపాన్ని ప్రత్యక్షంగా సందర్శించాలని, అక్కడ మండపాల వద్ద భద్రతపరమైన ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. వినాయక ప్రతిష్టాపనకై ఏర్పాటు చేసే మండప నిర్మాణం రోడ్లపై చేపట్టకుండా, జనజీవనానికి ఇబ్బంది లేకుండా మండప యజమానులకు సూచించాలని అన్నారు. భద్రత దృష్ట్యా ప్రతి మండపం వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలని, ఎట్టి పరిస్థితులలోనూ పెద్ద శబ్దాలతో కూడిన లౌడ్ స్పీకర్స్, డి.జె. లకు అనుమతి లేదని, ఎవరైన డి.జె. ఏర్పాటు చేస్తే మండప నిర్వాహకులపై, డి.జె యాజమానులపై చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని నిర్వాహకులకు సూచించాలన్నారు. మండప ఏర్పాట్లకు సంభందించి ప్రతి ఒక్కరూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా పోలీసు అనుమతి తీసుకునేలా చూడాలని, మండపాల వద్ద మైకులు, స్పీకర్లను తక్కువ సౌండ్ తో, రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించేలా చూడాలని అన్నారు. నిమార్జనం రోజు చెరువుల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉండే విధంగా సంభందిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. పాతనేరస్తులను, ముందస్తుగా బైండోవర్ చేయాలని, సమస్యలను సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండి కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడరాదు అన్నారు. ముఖ్యంగా యువత సోషల్ మీడియా ద్వారా వచ్చే పుకార్లను నమ్మరాదని, ఫార్వార్డ్ మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కుల మతాలకు అతీతంగా, శాంతియుత వాతావరణంలో పండగను జరుపుకోవాలని ఎస్పీ జిల్లా ప్రజలకు సూచించారు. 

*వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారికి పోలీసుల సూచనలు:*

*సంగారెడ్డి జిల్లాలో వినాయక మండపాలను ఏర్పాటు చేయదలచిన ప్రతి ఒక్కరు పోలీసు వారికి ముందస్తు సమాచారం తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.

  • * ఈ లింకులో సూచించిన వివరాలు పొందుపరిచిన అనంతరం, పోలీస్ శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుంది. ఆ తరువాతనే వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలి. 

*వినాయక మండపం ఏర్పాటు చేయదలచిన ప్రదేశం వివరాలతో పాటు నిమజ్జనం చేసే ప్రదేశం, రోజు, సమయం మరియు దారి వంటి వివరాలను కుడా ఈ లింక్ ద్వారా నమోదు చేయవలిసి ఉంటుంది. 

*బహిరంగ ప్రదేశాలలో వినాయక మండపాలను ఏర్పాటు చేసే మండప యజమానులు రహదారులపై, ప్రజలు తిరిగే రోడ్లపై మరియు కాలిబాటలపైన ప్రతిష్టించరాదు. మరియు ఎట్టి పరిస్థితులలోను జనజీవనానికి అంతరాయం కలిగించరాదు.

*వినాయక మండపాల వద్ద పూజా కార్యక్రమాలలో పాల్గొనే భక్తుల వాహనాల పార్కింగ్ కొరకు తగినంత దూరంలో, నిర్దేశించిన ప్రదేశాలలో పార్కింగ్ చేసుకొనె విధంగా పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవాలి.

*వినాయక మండప నిర్వాహకులు విద్యుత్ సరఫరాకై విద్యుత్ శాఖ నుండి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి మరియు భారీ వర్షాల నేపథ్యంలో మండపాల వద్ద షార్ట్ సర్క్యూట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకొని, నాణ్యతతో కూడిన మండప నిర్మాణం చేపట్టాలన్నారు.

*మండపాల వద్ద మైకులు, స్పీకర్లను తక్కువ సౌండ్ తో, రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించాలి. ముఖ్యంగా భారీ శబ్దంతో ఉండే లౌడ్ స్పీకర్లు, డి.జె. సౌండ్ సిస్టమ్స్ ఏర్పాట్లకు అనుమతి లేదు. ఎవరైనా లౌడ్ స్పీకర్లు, డి.జె. సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 

*పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాల వద్ద, ప్రార్థనా మందిరాల వద్ద పెద్ద శాబ్దాలతో లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేయరాదు. మరియు ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వాక్యలు చేయడం, పాటలు పెట్టడం వంటివి చేయరాదు.

*వినాయక మండపాలను జాగ్రత్తగా చూసుకొనుటకు రాత్రి సమయంలో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు వాలంటీర్లు ఉండే విధంగా చూసుకోవాలి.

*వినాయక మండపాల వద్ద టపాకాయలను, మందుగుండు సామాగ్రిని ఉంచరాదు, మండపాల వద్ద కరెంట్ పోయినా, ఇబ్బంది లేకుండా ఎమర్జెన్సీ ల్యాంప్ అందుబాటులో ఉంచుకోవాలి. *మండపాల వద్ద వీడియో రికార్డింగ్ కోసం సి.సి.టివి కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. వినాయక మండపాల వద్ద లక్కీ లాటరీ లేదా బలవంతపు చందాలు చేయకూడదు.

*వినాయక మంటపం దగ్గర మత్తు పదార్థములు సేవించడం, జూదం ఆడటం, ఇతర అసాంఘిక కార్యక్రమాలు చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

*వినాయక మంటపం వద్ద ఇసుక బస్తాలను, నీటి డ్రమ్ములు వంటి అగ్ని నిరోధకాలను అందుబాటులో ఉంచుకోవాలి.

*రాత్రి సమయంలో తనిఖీ చేయడానికి వచ్చే పోలీస్ అధికారికి మంటప వలంటీర్లు సహకరించాలి.

*మట్టి వినాయక విగ్రహాలను పెట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 

*మితిమీరిన విగ్రహ పరిమాణల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున విగ్రహ పరిమాణాలలో పరిమితులు పాంటించాలి. 

*అత్యవసర సమయంలో, ఏదైనా సమాచారం ఉన్నా డయల్ 100 కు గాని, సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment