ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
శస్త్రచికిత్స అనంతరం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజలకు సేవ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఆయన త్వరగా శక్తిని పుంజుకుని, మునుపటి కంటే ఆరోగ్యంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్కు వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, ఆయన క్షేమంగా, ఆరోగ్యంగా కోలుకుంటున్నారని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని, త్వరలోనే నూతన శక్తితో తిరిగి వస్తారని నాగబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం నాడు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించి, వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శనివారం సాయంత్రం ఆయనకు శస్త్రచికిత్స జరిగింది.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, 7 నుంచి 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ తెలిపారు. అనారోగ్య సమస్య, శస్త్రచికిత్స వివరాలను పార్టీ వర్గాలు వెల్లడించలేదు.












