తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) ఒక ధర్మయుద్ధాన్ని ప్రారంభించిందని రాష్ట్ర జాగృతి కార్యదర్శి ఇ.మురళీ కృష్ణ తెలిపారు. సంగారెడ్డిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం అనంతరం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి విస్తృత కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
పార్టీ తరఫున ప్రకటించిన అజెండాను గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కట్టుబడి పని చేయాలని మురళీ కృష్ణ పిలుపునిచ్చారు.
“పంచజన్యం” ప్రాముఖ్యతను వివరిస్తూ, మహాభారతంలో శ్రీకృష్ణుడి శంఖారావం ధర్మయుద్ధానికి సంకేతమని, నేటి సమాజంలో అన్యాయాలపై పోరాటానికి అదే స్ఫూర్తి అవసరమని ఆయన పేర్కొన్నారు.
నాయకురాలు కవితమ్మ ధర్మయుద్ధం కోసం శంఖారావం పూరించారని, ప్రజల హక్కుల కోసం బలమైన పిలుపునిచ్చారని, ఆమె నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మద్ది శ్రీనివాస్ రెడ్డి, చంద్రిక కరుణాకర్, నాల్ల కృష్ణ మోహన్, సారా నితిన్ కుమార్, కళ్ళెం సాయి కాంత్ గౌడ్, తంగడిపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.












