సాయిరెడ్డిపైనా వైసీపీ దాడి షురూ!
వైసీపీ భవిష్యత్తు కోసం సలహాలు, సూచనలు ఇచ్చే వారిని ఆ పార్టీ నేతలు ఓ రకమైన దృష్టితో చూస్తుండటం అందరికీ తెలిసిందే. ఈ సలహాలు, సూచనలు తమకు అనుకూలంగా ఉన్నంత వరకు ఓకే… అవే సలహాలు తమను కాస్తంత ఇబ్బంది పెట్టాయన్న ఫీలింగ్ వచ్చిందంటే.. వైసీపీకి చెందిన నేతలు వరుసబెట్టి మరీ ఎదురు దాడికి దిగుతారు. అలాంటిది మొన్నటిదాకా వైసీపీలో ఓ కీలక నేతగా కొనసాగి… ఆపై రాజకీయాలనే వదిలేసి వెళ్లిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకంగా పార్టీకి చెందిన కీలక నేతలను ఓ కోటరీగా అభివర్ణిస్తూ వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అందుకే సాయిరెడ్డిపై వైసీపీ నేతల ఎదురు దాడి మొదలైపోయింది.
వైసీపీ పతనానికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ విస్తరించి ఉన్న కోటరీనేనని సాయిరెడ్డి బుధవారం మధ్యాహ్నం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టు వాటాల బదలాయింపునకు సంబంధించిన కేసులో సీఐడీ విచారణకు హాజరైన సాయిరెడ్డి…విచారణ అనంతరం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వైవీ విక్రాంత్ రెడ్డి కనుసన్నల్లోనే వాటాల విక్రయం జరిగిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా జగన్ చుట్టూ చేరిన కోటరీ కారణంగా పార్టీ ఇబ్బందుల్లో పడిందని చెప్పారు. కోటరీని దూరం పెట్టకుంటే జగన్ కు భవిష్యత్తే లేదని కూడా ఆయన తేల్చి పారేశారు.
ఈ మాటలు విన్నంతనే… పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్న విషయాన్నీ మరిచిన వైసీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు మీడియా ముందుకు వచ్చారు. సీఐడీ విచారణ అనేది ఓ బూటకమని… విచారణ పేరుతో వచ్చి సాయిరెడ్డి డ్రామా చేశారని ఆయన విరుచుకుపడ్డారు. సుబ్బారెడ్డి, కేవీ రావుల మధ్య ఎలాంటి సంబంధాలు లేవన్న సుధాకర్ బాబు.. ఇద్దరి మధ్య సంబంధాలుంటే.. కేవీ రావు ఎందుకు కేసు వేశారని ప్రశ్నించారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను సాయిరెడ్డి చదివారని ఆరోపించారు. వైసీపీ ద్వారా ఎదిగిన సాయిరెడ్డి.. పార్టీ అదినేత కష్టకాలంలో ఉంటే పార్టీని వదిలి వెళ్లారని మండిపడ్డారు. జగన్ అంటే గిట్టని రఘురామకృష్ణరాజుకు సాయిరెడ్డి తన ఇంటికి ఎందుకు అద్దెకు ఇచ్చారని ప్రశ్నించారు. సాయిరెడ్డి పదే పదే కోటరీ అని మాట్లాడుతున్నారన్న ఆయన.. సాయిరెడ్డే ఎంతో మంది నేతలను జగన్ కు పరిచయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు సాయిరెడ్డిని మించిన కోటరీ ఏముంటుందని కూడా ఆయన ప్రశ్నించారు.