సమాజంలో మహిళల రక్షణ కోసం పురుషులు కూడా క్రియాశీలకంగా వ్యవహరించాలని, వారిని వేధింపులకు గురిచేసినప్పుడు ప్రశ్నించే ధైర్యాన్ని అలవర్చుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో 'స్టాండ్ విత్ హర్' క్యాంపెయిన్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ జేఎన్టీయూ క్యాంపస్ ఆడిటోరియంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన “స్టాండ్ విత్ హర్” క్యాంపెయిన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా Stand With Her క్యాంపెయిన్ బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. మహిళల భద్రత, గౌరవం, సమానత్వాన్ని కాపాడడంలో పురుషులు బాధ్యతాయుతమైన పాత్ర పోషించాల్సిన అవసరాన్ని తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విమెన్ సేఫ్టీ విభాగాన్ని ముఖ్యమంత్రి గారు అభినందించారు.
ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, మహిళల భద్రతతో పాటు వారి ఆర్థిక స్వావలంబన కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. మహిళలను శక్తితో, కుటుంబ గౌరవంతో పోల్చుతామని, అయితే మహిళలు నిత్యం అభద్రతా భావంతో బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండకూడదని అన్నారు. ఈ దుస్థితిని నివారించడానికి ప్రతి ఒక్కరూ తమను తాము సవరించుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే, ఆర్థిక స్వావలంబన దిశగా మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, వడ్డీలేని రుణాలు మహిళల పేరుమీదే ఇస్తున్నామని, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు, ఆర్టీసీ బస్సులకు వారిని యజమానులుగా చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ గ్రామీణ మహిళలు తయారు చేసే ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించేలా అమెజాన్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని, మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టుకున్నామని ఆయన వివరించారు.
గతంలో బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు వేధింపులు ఎదురయ్యేవని, కానీ ఈరోజుల్లో ఫిజికల్ క్రైమ్ కంటే ఆన్లైన్ క్రైమ్ పెరిగిపోయిందని, డీప్ ఫేక్ వీడియోలను నియంత్రించడానికి తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగాన్ని కూడా పటిష్టం చేశామని ఆయన తెలిపారు. ఏదైనా జరిగినప్పుడు అమ్మాయిదే తప్పు అని నిందలు వేసే చెడు సంప్రదాయాన్ని వదులుకొని, ఇబ్బందుల్లో ఉన్న మహిళల కోసం ‘స్టాండ్ విత్ హర్’ అనే నినాదంతో వారికి అండగా నిలబడాలని ముఖ్యమంత్రి గారు అన్నారు.

