ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామసభలు, వార్డు సభలను క్రమబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక–ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 2న ఈ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులతో గ్రామసభలు/వార్డు సభల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
సభలను తెలంగాణ గీతంతో ప్రారంభించి, అనంతరం ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రజలకు వినిపించాలని, ప్రభుత్వ పథకాలపై సమగ్ర అవగాహన కల్పించడం ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతు భరోసా, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ వంటి పథకాల లబ్ధిదారుల వివరాలను సభల్లో వెల్లడించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జూన్ 2 నుండి ప్రారంభించనున్న ఇందిరమ్మ కుటుంబ జీవన భీమా పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అల్పాహార, మధ్యాహ్న భోజన పథకాలపై ప్రజలకు వివరించాలని, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులతో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మాట్లాడుతూ గ్రామసభలు, వార్డు సభలను నిర్దేశిత SOPల ప్రకారం కచ్చితంగా నిర్వహించాలని, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని, పథకాల అమలుపై లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించి వాటి ప్రభావాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 6 నుండి “హెల్త్ వీక్” నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.












