భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా వేడుకలు జరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈ కార్యక్రమాల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.
జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో, మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ చేసిన సేవలు దేశానికి ఎంతో మార్గదర్శకమని కొనియాడారు. ఆయన ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలిపారు.
సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ చూపిన మార్గం అందరికీ ఆదర్శప్రాయమని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, జిల్లా రెవెన్యూ అధికారి పాండుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, దళిత, బడుగు, బలహీన వర్గాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.












