తెలంగాణ రాష్ట్రంలోని బీడీ కార్మికులకు నెలకు రూ. 4016 జీవన భృతిని అమలు చేయడానికి రాష్ట్ర బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం (బిఎల్ టీయూ) రాష్ట్ర అధ్యక్షులు యస్. సిద్దిరాములు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి, హామీని నెరవేర్చాలని ఆయన కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎలాంటి షరతులు లేకుండా నెలకు రూ. 4016 జీవన భృతిని అందిస్తామని, 2014 ఫిబ్రవరి 28 నాటి కటాఫ్ తేదీని తొలగిస్తామని హామీ ఇచ్చిందని, అయితే రెండు సంవత్సరాలు గడిచినా ఆ హామీ అమలు కాలేదని సిద్దిరాములు పేర్కొన్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చటన్, నెలసరి ఉద్యోగులు, టేకేదార్లతో సహా అన్ని రంగాల కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. బీడీ పరిశ్రమలో పనులు గణనీయంగా తగ్గిపోవడం, కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా కార్మికులకు నెలలో 10 రోజులు కూడా పని దొరకని పరిస్థితి నెలకొందని, దీంతో వారి కుటుంబాలు జీవనోపాధి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు.
ఈ నేపథ్యంలో, గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు, ఈ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి, PF నంబరు ఉన్న ప్రతి బీడీ కార్మికులకు, బీడీ టేకెదారులకు, ప్యాకర్లకు, బట్టి–చటన్ టేబుల్ పని చేసే కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా నెలకు రూ. 4016 జీవన భృతి అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విధించిన 2014 కటాఫ్ తేదీని రద్దు చేసి, అర్హులైన ప్రతి కార్మికుడికి ఈ పథకం వర్తించేలా చూడాలని కూడా ఆయన కోరారు.












