పనుల జాతరతో రాష్ట్రం అంతటా పండుగ వాతావరణం
ములుగు జిల్లాలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సీతక్క
పనుల జాతరలో భాగస్వామ్యం అవుతున్న ప్రజాప్రతినిధులకు మంత్రి సీతక్క ధన్యవాదాలు
కమీషనర్ నుంచి కారోబార్ వరకు అధికారులందరికి అభినందనలు- మంత్రి సీతక్క
హైదరాబాద్, ఆగస్టు 23:
పనుల జాతరతో ఊరురా బతుకమ్మ పండుగ వాతావరణం నెలకొంది. నియోజకవర్గాల వ్యాప్తంగా ఉత్సాహంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరుగుతున్నాయి. రెండో రోజు పనుల జాతరలో భాగంగా ములుగు జిల్లా మల్లంపల్లి శ్రీనగర్ గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా.దనసరి అనసూయ సీతక్క శనివారం నాడు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జె.డి. మల్లెంపల్లి మండలంలోని ఎం.డి. గౌస్ పల్లెలో నిర్మాణం పూర్తి చేసుకున్న కల్వర్ట్ను ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి, సుస్థిరత లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది ఆద్వర్యంలో శుక్రవారం నాడు పనుల పండగా మొదలైఇంది. ఉపాధి అవకాశాలను పెంచుతూ, మౌలిక సదుపాయాలను విస్తరించే దిశగా పనుల జాతర ముందుకు సాగుతోంది. మొదటి రోజు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రూ.205 కోట్లతో మొత్తం 13,552 పనులు ప్రారంభించబడగా, రూ.1994 కోట్ల నిధులతో 88,037 అభివృద్ధి పనులకు అనుమతి పత్రాలు జారీ అయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో 1,01,589 పనులు రూ.2199 కోట్ల నిధులతో ప్రారంభమవడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.
ఇప్పటి వరకు 65 మందికిపైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పనుల జాతరలో భాగస్వామ్యం కావడం విశేషం. ప్రజల భాగస్వామ్యంతో ఊరూరా బతుకమ్మ పండగగా పనుల జాతర మారింది. పనుల జాతరను మంచి సమన్వయంతో సక్సెస్ సాధించిన పంచాయతీరాజ్ కమిషనర్ నుండి పంచాయతీ కార్యదర్శి, కారోబార్ వరకు అందరికీ మంత్రి సీతక్క హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ప్రతి కుటుంబానికి వేతనముతో కూడిన పనిని కల్పించడం ద్వారా మౌలిక వసతుల కల్పన, ఉత్పాదకత పెంపు, సుస్థిరమైన ఆస్తుల సృష్టి లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాలు ప్రజా విజయోత్సవానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రములోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సహచర మంత్రులు పాల్గొనడం ఎంతో సంతోషకరమని తెలిపారు. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారుల సమిష్టి కృషితో ఈ కార్యక్రమం ఘన విజయం సాధించిందని అన్నారు.
ఈ విజయానికి తోడ్పడిన ప్రజాప్రతినిధులందరికీ మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.