విధి నిర్వహణలో పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రజల ధన, మాన ప్రాణ రక్షణలో అహర్నిశలు కృషి చేస్తూ.. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరయ్యారు. మంగళవారం పోలీస్ ఫ్లాగ్ డే ను పురస్కరించుకొని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో స్మృతి పరేడ్ నిర్వహించి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… 21 అక్టోబర్ 1959 వ సంవత్సరంలో సి.ఆర్.పి.యఫ్ – ఎస్.ఐ కరమ్ సింగ్ నాయకత్వంలోని 20 మంది భారత జవాన్లు లడక్ ప్రాంతంలో హాట్ స్ట్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా, చైనా ఆర్మీ మన ఆర్మీ పై దొంగ దాడి చేసి 10మందిని జవాన్ లను హతమార్చిందని, ఆ రోజు నుండి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా (పోలీస్ ఫ్లాగ్ డే)గా నిర్వహిస్తున్నామని అన్నారు.   ఒక్కొక రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉండేవి, మన రాష్ట్రంలో గతంలో నక్సలిజం ప్రభావం ఎక్కువగా ఉండేదని, ఆ సమయంలో ఎంతో మంది జవాన్లను కోల్పోవడం జరిగిందని, పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛతీస్ ఘడ్ మరియు అస్సాం వంటి కొన్ని నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలలోనూ అనేక మంది జవాన్లను కోల్పోవడం జరిగిందన్నారు. జమ్ముకాశ్మీర్ లాంటి రాష్ట్రాలలో పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులతో ఎంతో మంది పోలీసులు, ఆర్మీ జవాన్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉగ్ర మూకలను హతమార్చి, తమ తనువులను చాలించారని, ఆనాటి వారి ప్రాణత్యాగల వలననే మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామని తెలిపారు. ఈ సంవత్సరంలో మన దేశంలో విధినిర్వహణలో 191-మంది జవాన్లు వీరమరణం పొందారని, ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు 5- మంది ఉన్నారని, వీరమరణం పొందిన వారి ప్రాణ త్యాగాలను స్మరిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు సంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు వీర జవాన్లు వివిధ సంఘటనలలో నక్సల్స్, సంఘ విద్రోహ శక్తుల దుశ్చర్యలకు బలి అయ్యారన్నారు. ఇందులో సిర్గాపూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన జంగయ్య, సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కు చెందిన ఎల్లయ్య, జిన్నారం పోలీస్ స్టేషన్ కు చెందిన సత్యనారాయణ, కంగ్టి పోలీస్ స్టేషన్ కు చెందిన సురేష్ విధి నిర్వహణలో ప్రాణాలర్పించి వీర మరణం పొందారని, వారి ఆత్మకు శాంతి చేకూరలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నానన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రవీణ్య మాట్లాడుతూ.. పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని, ఆనాటి వారి ప్రాణత్యాగల వలననే నేడు మనందరం సుఖ:సంతోషాలతో ఉండగలుగుతున్నామని అన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితిలలోనైనా పోలీసు శాఖ ఎదురు నిలబడి, పోరాడటం జరుగుతుందని, అలాంటి పోలీసుల సేవలు మనందరి మదిలో చిరస్మరణీయమని అన్నారు. గత జూన్ నెలలో జరిగిన సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఎంతో మంది పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శిధిలాల క్రింద చిక్కుకు పోయిన మృతదేహాలను వెలికి తీసి, తమ ధైర్య సహసాలను చాటుకున్నారని తెలిపారు. అమరులైన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని అన్నారు. వారి కుటుంబాల సంక్షేమం, వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలను చేకూరేలా, వారి కుటుంబాలలో మనోధైర్యాన్ని అందించటమే పోలీసు అమరవీరులకు అందించే నిజమైన నివాళి అన్నారు. అనంతరం పోలీస్ అమరుల కుటుంబసభ్యులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీతో కలిసి అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందజేశారు. అమరవీరులు అయిన పోలీసుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31వ తేదీ “జాతీయ ఐక్యత దినోత్సవం” వరకు ప్రజలకు – పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, శ్రీనివాస రావు, సంగారెడ్డి డీఎస్పీ.సత్యయ్య గౌడ్, జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్, నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, ఏఆర్.డీఎస్పీ. నరేందర్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ. కళ్యాణి, యస్.బి. ఇన్స్పెక్టర్స్ కిరణ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, జిల్లా ఇన్స్పెక్టర్స్, ఆర్.ఐ.లు రామరావ్, పరేడ్ కమాండర్ – రాజశేఖర్ రెడ్డి, పరేడ్ కమాండర్ డానియెల్. మరియు అమరవీరుల కుటుంబ సభ్యులు హాజరై నివాళులు అర్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment